రాయపాటి వాటిపై ఎందుకు విముఖత చూపారు?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు ప్రమేయం ఏమాత్రం లేదు. అసలు [more]

Update: 2021-04-08 13:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు ప్రమేయం ఏమాత్రం లేదు. అసలు ఎన్నికలు జరుగుతున్న విషయం కూడా రాయపాటికి గుర్తులేనట్లుంది. ఇంతకీ రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల నాటికైనా యాక్టివ్ అవుతారా? లేదా? అన్నది పార్టీ నేతలకే సందేహంగా మారింది.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో…

ఏ ఎన్నికలయినా రాజకీయ నేతలు ముందుండాలి. అందులోనూ మూడు దశాబ్దాల పాటు గుంటూరు జిల్లాను శాసించిన రాయపాటి సాంబశివరావు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. కుమారుడు, కూతురికే వదిలేశారు. నిజానికి రాయపాటి సాంబశివరావు 2014 లో నరసరావు పేట నుంచి టీడీపీ తరుపున పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2019లో అక్కడి నుంచే పోటీ చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇరవై నెలలుగా…

దాదాపు ఇరవై నెలలుగా రాయపాటి సాంబశివరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. గుంటూరు, నరసరావు పార్లమెంటు పరిధిలోని గ్రామ, మండల స్థాయి టీడీపీ నేతలు ఇప్పటికీ రాయపాటి సాంబశివరావును కలిసేందుకు వస్తారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనేక మంది రాయపాటి ఆశీస్సుల కోసం వచ్చినా ఆయన తనకు సంబంధం లేదని చెప్పారట. ఆయన కుమారుడు రాయపాటి రంగారావును కలిసి వారు వెళ్లిపోవాల్సి వచ్చింది.

వచ్చే ఎన్నికలలోనూ….

ముఖ్యంగా సీబీఐ వరస దాడులతో రాయపాటి సాంబశివరావు దిగులు పడ్డారని తెలిసింది. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాయపాటి సాంబశివరావు పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. ఆయన తనయుడు రంగరావుకు ఎమ్మెల్సీ సీటు కోసం ఆయన ప్రయత్నిస్తారు తప్పించి తాను పోటీ చేయరట. ఇప్పటికే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, మరొకరిని ఎంపీ అభ్యర్థిగా చూసుకోవాల్సిందిగా పార్టీ అధినాయకత్వానికి రాయపాటి సాంబశివరావు చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద రాయపాటి సాంబశివరావు ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News