ఈ నేత‌ల రూటెటు?… రెండూ వ‌దిలేశాయా ?

రాజ‌కీయాల్లో దూకుడు ఎప్పుడూ ప‌నిచేయ‌దు. అదే స‌మ‌యంలో స‌మ‌యానికి త‌గిన విధంగా వ్యవ‌హ‌రించ‌క‌పోతే.. నేత‌లు సైతం గ‌ల్లంత‌వుతారు. ఈ విష‌యం తెలిసో.. తెలియ‌కో.. కానీ, గుంటూరు జిల్లాకు [more]

Update: 2021-05-16 13:30 GMT

రాజ‌కీయాల్లో దూకుడు ఎప్పుడూ ప‌నిచేయ‌దు. అదే స‌మ‌యంలో స‌మ‌యానికి త‌గిన విధంగా వ్యవ‌హ‌రించ‌క‌పోతే.. నేత‌లు సైతం గ‌ల్లంత‌వుతారు. ఈ విష‌యం తెలిసో.. తెలియ‌కో.. కానీ, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీల‌క నేత‌లు.. అందునా.. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను చ‌క్రం తిప్పగ‌లిగిన నాయ‌కులు ఇప్పుడు ద‌శ‌-దిశ లేకుండా పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వారే.. ఒక‌రు టీడీపీకి చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. మ‌రొక‌రు వైసీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ఇద్దరూ కూడా ఆయా పార్టీల అధినేత‌ల సామాజిక వ‌ర్గమే కావ‌డం.. అదే పార్టీల్లో ప్రాధాన్యం లేక పోవ‌డం.. ఆస‌క్తిగా మారింది.

ఓటమి నాటి నుంచి…

రాయ‌పాటి సాంబ‌శివ‌రావుని తీసుకుంటే.. చంద్రబాబు ద‌గ్గర మ‌న‌సు గెలుచుకోలేక‌పోయార‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సరావుపేట ఎంపీ టికెట్‌ను ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకాడారు. అప్పటికే ఆయ‌న‌కు అందిన నిఘా స‌మాచారం కావొచ్చు.. లేదా పార్టీ నేత‌ల స‌మాచారం కావొచ్చు.. రాయ‌పాటికి టికెట్ వ‌ద్దనుకున్నారు.కానీ, అప్పట్లో సాంబ‌శివ‌రావు తీవ్రమైన ఒత్తిడి తెచ్చార‌ని.. చివ‌ర‌కు బ్లాక్ మెయిల్ కూడా చేశార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చసాగింది. దీంతో విధిలేని ప‌రిస్థితిలో బాబు టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి బాబు ఆయ‌న‌ను ప‌క్కన పెట్టారు.

పార్టీ కార్యక్రమాలకు కూడా…?

ఇప్పుడు అసలు రాయపాటి సాంబ‌శివ‌రావు పేరు వినేందుకు కూడా బాబు ఇష్టప‌డ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న‌ను పార్టీలోనూ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. రాయ‌పాటి రంగారావు పార్టీలోనే ఉన్నా.. కార్యక్రమాల‌కు ఆయ‌న కు ఆహ్వానం అంద‌డం లేదు. దీంతో వీరి ప‌రిస్థితి ఏంటో అర్ధం కావ‌డం లేదు. ఇక‌, వైసీపీ నాయ‌కుడు, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి కూడా వైసీపీలో ఇంతే గౌర‌వం ద‌క్కుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌ను సైతం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు పంతం కోసం టికెట్ ద‌క్కించుకున్నా.. ఆయ‌న ఓడిపోయారు.

త్వరలోనే…?

ఆ త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌విని ఆశించారు. కానీ, ప్రజాబ‌లాన్ని బేరీజు వేసుకున్న జ‌గ‌న్‌.. ఆయ‌న‌ను ప‌క్కన పెట్టారు. అయితే.. వ్యాపార లావాదేవీలు.. ఇత‌ర‌త్రా సంబంధాలుఉన్న నేప‌థ్యంలో చూసీచూడ‌న‌ట్టు ఉన్నారు. మ‌రోవైపు స్థానికంగా కూడా నేత‌లు ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో పార్టీలో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్దరు కీల‌క నేత‌ల రూటు ఎటు? అనే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. త్వర‌లోనే బీజేపీ ఇక్కడ చ‌క్రం తిప్పుతుంద‌ని..సాంబ‌శివ‌రావు ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని అంటున్నా.. మోదుగుల మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News