ఈసారి పార్టీయే కాదు… నియోజకవర్గం కూడా?

రాజకీయాల్లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే ఇక అంతే. భవిష్యత్ వెతుక్కున్నా కనపడదు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పరిస్థితి అలాగే ఉంది. పార్టీలు వరసగా [more]

Update: 2021-04-20 09:30 GMT

రాజకీయాల్లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే ఇక అంతే. భవిష్యత్ వెతుక్కున్నా కనపడదు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పరిస్థితి అలాగే ఉంది. పార్టీలు వరసగా మారినా ఆయనకు రాజకీయ భవిష్యత్ కనుచూపు మేరలో కన్పించడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గానికి రావెల కిషోర్ బాబు మారాలనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవంటున్నారు.

రాజకీయాల్లోకి రాగానే….?

రావెల కిశోర్ బాబు మాజీ ఐఆర్ఎస్ అధికారి. రాజకీయాల్లోకి వచ్చిరాగానే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. వెనువెంటనే సామాజికవర్గం కోణంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో నియోజకవర్గంలోని ఒక సామాజికవర్గం తనను డామినేట్ చేయడం ఆయన సహించలేకపోయారు. వారికి ఎదురు తిరిగారు. ఫలితంగా మంత్రిపదవి ఊడిపోయింది.

పార్టీలు మారుతూ….

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనుకున్నా అక్కడ అవకాశాలు లేకపోవడంతో జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. 2019 ఎన్నికల అనంతరం జనసేనను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. రావెల కిషోర్ బాబు చేరిన తర్వాత జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో జనసేన, బీజేపీ కూటమి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఫలితం ఉండదు. అక్కడ టీడీపీ, వైసీపీ బలంగా ఉండటంతో మరోసారి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉండదని రావెల కిషోర్ బాబు భావిస్తున్నారు.

నియోజకవర్గం మార్చాలని…..

అందుకోసమే మరో రిజర్వ్ నియజకవర్గం కోసం ఆయన వెతుకులాట ప్రారంభించినట్లు తెలిసింది. తిరిగి టీడీపీలో చేరడమా? లేక వైసీపీలో చేరి మరో రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమా? అన్న ఆలోచనలో రావెల కిషోర్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సన్నిహితులతో జరిగిన సమావేశంలో వైసీపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. మొత్తం మీద మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News