తెగించినా.. చూసీ చూడనట్లే ఉండాల్సిందేనా?

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెగించినట్లే కనపడుతుంది. ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలని పదే పదే జనసేనను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. [more]

Update: 2020-08-29 00:30 GMT

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెగించినట్లే కనపడుతుంది. ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలని పదే పదే జనసేనను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనను ఏం చేయలేదనే ధైర్యం కావచ్చు. అందుకే రాపాక వరప్రసాద్ తాను వైసీపీ ఎమ్మెల్యేనని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీ కి భవిష్యత్తు లేదని చెప్పడం వెనక కూడా తాను పార్టీని వీడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పినట్లయింది.

ఏమీ చేయలేని పరిస్థితి….

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థిితి. రాపాక వరప్రసాద్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. పార్టీ నుంచి బహిష్కరిస్తే అది రాపాక వరప్రసాద్ కే ప్రయోజనం. అప్పుడు నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యే అవుతారు. అందుకే పవన్ కల్యాణ్ రాపాక వరప్రసాద్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఒక దశలో నిర్ణయం తీసుకోవాలని…

ఇటీవల రాపాక వరప్రసాద్ జనసేనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వెంటనే పవన్ కల్యాణ్ సీనియర్ నేతలతో సంప్రదించారు. పార్టీ నుంచి బహిష‌కరిస్తే ఏమవుతుందని, ఒక్క ఎమ్మెల్యే పదవి ఉన్నా లేనట్లే కదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే నాదెండ్ల మనోహర్ లాంటి నేతలు బహిష్కరణ వద్దు అని పవన్ కల్యాణ్ కు సూచించినట్లు సమాచారం. రాపాక వరప్రసాద్ ఎంత పార్టీ పై బరుద జల్లితే అది లాభమని, సానుభూతి వస్తుందని కూడా పవన్ కు వివరించినట్లు తెలిసింది.

పార్టీకి ప్రయోజనమే నంటున్న….

అందుకే తాను వైసీపీ ఎమ్మెల్యేనని రాపాక వరప్రసాద్ చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రానున్న కాలంలో రాపాక వరప్రసాద్ మరిన్ని వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా చేసే అవకాశాలున్నాయి. ఈ విషయం జనసేన నేతలకు తెలియంది కాదు. రాపాక వరప్రసాద్ ను ప్రస్తుతానికి చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద జనసేన పార్టీ మాత్రం రాపాక వరప్రసాద్ పార్టీకి ఎంత వ్యతిరేకంగా వ్యవహరించినా చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం లేవు.

Tags:    

Similar News