రంజుగా మారిన రాజ‌కీయం….ఎవరు విన్నరో?

అధికార వైఎస్సార్ సీపీలో ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఎవ‌రికి వారు త‌మ‌కంటే.. త‌మ‌కే ప‌ద‌వులు ద‌క్కాల‌ని, త‌మ‌దే ఆధిప‌త్యం కావాల‌ని కోరుతున్నారు. ఫ‌లితంగా ఎక్కడిక‌క్కడ నేత‌ల మ‌ధ్య [more]

Update: 2020-08-19 03:30 GMT

అధికార వైఎస్సార్ సీపీలో ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఎవ‌రికి వారు త‌మ‌కంటే.. త‌మ‌కే ప‌ద‌వులు ద‌క్కాల‌ని, త‌మ‌దే ఆధిప‌త్యం కావాల‌ని కోరుతున్నారు. ఫ‌లితంగా ఎక్కడిక‌క్కడ నేత‌ల మ‌ధ్య పోరు సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాలు స‌హా అన్ని చోట్లా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, ఎక్కడా బ‌య‌ట ప‌డ‌డం లేదు. గుంభ‌నంగా ఉన్న ఈ వ్యవ‌హారంపై నాయ‌కులు క‌న్నెర్ర చేస్తున్నా.. జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డి.. మౌనం పాటిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన యేడాది వ‌ర‌కు ఏ వైసీపీ నేత ఎంత అసంతృప్తి ఉన్నా బ‌య‌ట పెట్టే ధైర్యం చేయ‌లేదు. జ‌గ‌న్‌కు ఏకంగా 151 మంది ఎమ్మెల్యే బ‌లం ఉంది. అన‌ధికారికంగా మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా స‌పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప‌ద‌వుల విష‌యంలో ఒక్కో నేత నోరు తెర‌చి త‌మ అసమ్మతి గ‌ళాలు వినిపిస్తున్నారు.

రాపాక బయటపడటంతో….

వైసీపీలో అస‌మ్మతిపై నిన్నటి వ‌ర‌కు సొంత పార్టీ నేత‌లు ఓపెన్ అవుతుంటే.. తాజాగా ఈ విష‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్రసాద్ మాత్రం బ‌య‌ట‌ప‌డి పోయారు. తాను జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం సాధించాన‌ని, అయినా త‌న ప్రయాణం మాత్రం వైఎస్సార్ సీపీతోనే కొన‌సాగుతుంద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టి చెప్పిన ఆయ‌న‌.. రాజోలులో వైఎస్సార్ సీపీ ప‌రిస్థితి బాగోలేద‌ని వెల్లడించ‌డం ఇప్పుడు పార్టీలో సంచ‌ల‌నంగా మారింది. ఇక్కడ ముగ్గురు నాయ‌కులు చ‌క్రం తిప్పేందుకు నేనంటే నేన‌ని పోటీ ప‌డుతున్నారు. వారిలో తాను కూడా ఉన్నాన‌ని, ఈ విష‌యంపై పార్టీ అధిష్టానం ఎంత త్వర‌గా అయితే అంత త్వర‌గా తేల్చాయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం ఆశ్చర్యం క‌లిగిస్తోంది. దీంతో ఇప్పుడు రాజోలు రాజ‌కీయంగా ఆస‌క్తిగా చ‌ర్చకు వ‌చ్చింది.

మూడు గ్రూపులుగా మారి…..

అధికార పార్టీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బొంతు రాజేశ్వర‌రావు పోటీ చేసి రాపాకపై ఓడిపోయారు. త‌ర్వాత రాపాక‌.. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో ఈ ఇద్దరి మ‌ధ్య రాజ‌కీయాలు ప‌రిమిత‌మ‌వుతాయ‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మాల కార్పొరేష‌న్ చైర్మన్ పెడ‌‌పాటి అమ్మాజీ రంగ ప్రవేశం చేశారు. ఆమె నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్‌. అయిన‌ప్పటికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం చ‌క్రం తిప్పుతున్నారు. బొంతు రాజేశ్వర‌రావు 2014, 2019 ఎన్నిక‌ల్లో ఇక్కడ ఓడినా ఆయ‌న‌కు బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. ఆయ‌న ఇక్కడ రాజ‌కీయాల‌ను శాసించే ఓ ముగ్గురు రాజులు ( క్షత్రియ సామాజిక వ‌ర్గం నేత‌లు) మాట విన‌డం లేద‌నే ప‌ట్టుబ‌ట్టి జ‌గ‌న్‌పై ఒత్తిడి తెచ్చి మ‌రీ అమ్మాజీని ఇన్‌చార్జ్‌గా నియ‌మించుకున్నారు.

రాపాక కు సపోర్ట్ పెరగడంతో…

అయితే ఇప్పుడు అదే ముగ్గురు రాజులు రాపాక‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మూడు వ‌ర్గాలు ఇక్డ మూడు కూట‌ములుగా మారిపోయాయి.ఈ క్రమంలో ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. రాపాక ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకున్నార‌ని చెప్పారు. అయితే, బొంతు రాజేశ్వర‌రావు వ‌ర్గం పీక‌ల మీద క‌త్తి పెట్టి జ‌గ‌న్‌పై ఒత్తిడి చేసింద‌ని, దీంతో కాద‌న‌లేని ప‌రిస్థితిలోనే ఆయ‌న‌కు టికెట్ ఇచ్చార‌ని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజే జ‌గ‌న్‌ను కలిశాన‌ని.. అప్పుడే జ‌గ‌న్ నీకే సీటు ఇవ్వాల‌నుకున్నా కుద‌ర్లేద‌ని.. అయినా గెలిచావు.. క‌లిసి ప‌ని చేద్దామ‌ని జ‌గ‌న్ త‌న‌తో సూచించార‌ని రాపాక అన్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఫండ్స్‌తో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నుల నిధులు కూడా త‌న‌కే కేటాయిస్తున్నార‌ని ఆయ‌న ఓపెన్‌గానే చెప్పారు. ఈ వ్యాఖ్యల‌ను బ‌ట్టి చూస్తే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు జ‌గ‌న్ పాజిటివ్ అనే విష‌యాన్ని రాపాక‌ చెప్పక‌నే చెప్పారు.

వచ్చే ఎన్నికల్లోనూ…..

కొంద‌రు నాయ‌కులు త‌మ‌కు స్థాయి లేక‌పోయినా..చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నార‌ని, కానీ, అదంతా వృథా అని రాపాక అన్నారు. ఈ వ్యాఖ్య ఆయ‌న ప‌రోక్షంగా నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న అమ్మాజీపైనే వేశార‌ని తెలుస్తోంది. అంటే.. మొత్తంగా తాను చ‌క్రం తిప్పుతాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెప్పక‌నే చెప్పేసిన‌ట్టయింది. అంతేకాదు, ఈ మూడు ముక్కలాట ఇలా సాగితే.. పార్టీనే దెబ్బతింటుంది క‌నుక జ‌గ‌న్ ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల‌ని ఆయ‌న ఇక్కడ పార్టీ ప‌గ్గాలు త‌న‌కే ఇవ్వాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాజోలు వైసీపీలో ఈ మూడు ముక్కలాటలో ఎవ‌రు విన్నరో చూడాలి.

Tags:    

Similar News