షరతులు ఓకే అయితేనే?

“అనాది నుంచి అన్యాయమే… తనకు న్యాయం తెలుగుదేశం పార్టీలో జరగలేదు.” ఇది జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మనోగతం. ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేనని ఆయన [more]

Update: 2019-11-14 15:30 GMT

“అనాది నుంచి అన్యాయమే… తనకు న్యాయం తెలుగుదేశం పార్టీలో జరగలేదు.” ఇది జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మనోగతం. ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేనని ఆయన సన్నిహితుల వద్ద తెగేసి చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీ నేతలతో టచ్ లోకి కూడా వెళ్లారు. అయితే రామసుబ్బారెడ్డి తనకు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి ఇవ్వాలని కోరడంతో దీనిపై వైసీపీ అగ్రనాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఎన్ని కష్టాలు వచ్చినా….

జమ్మలమడుగు అంటే ముందుగా గుర్తుకొచ్చేది రామసుబ్బారెడ్డి. టీడీపీ ఆవిర్భావం నుంచి రామసుబ్బారెడ్డి కుటుంబం ఆ పార్టీనే నమ్ముకుని ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆయన టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. జైలు కెళ్లినా బెదరలేదు. పార్టీ చెప్పింది చేస్తూ వచ్చారు. 2004 ముందు వరకూ రామసుబ్బారెడ్డి హవా కొనసాగింది. అయితే గత పదిహేనేళ్లుగా ఆయన విజయాన్ని రుచి చూడలేదు. నాలుగు ఎన్నికల్లో వరస ఓటములతో ఉన్న రామసుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యారు. చంద్రబాబు చెప్పినట్లే నడుచుకున్నారు.

ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి….

తన చిరకాల ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్నా అసంతృప్తి వ్యక్తం చేశారు తప్పించి పార్టీని వీడలేదు. మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి హర్ట్ అయ్యారు. అయితే రామసుబ్బారెడ్డికి మాట ఇచ్చినట్లుగానే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చివరకు ఆదినారా‍యణరెడ్డి కుటుంబం కోసం చంద్రబాబు రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలంటే ఎమ్మెల్సీ వదులుకోవాల్సిందేనని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పడంతో రామసుబ్బారెడ్డి అయిష‌్టంగానే ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. ఆదినారాయణరెడ్డి వర్గం తన విజయానికి కృషి చేయలేదని రామసుబ్బారెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.

వైసీపీలో షరతులివే….

ఈ నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ కాలం జమ్మలమడుగులో రాజకీయం చేయలేరన్నది రామసుబ్బారెడ్డి ఆలోచన. అందుకే వైసీపీలో చేరి జమ్మలమడుగు ఇన్ ఛార్జి పదవిని ఆశించారు. అయితే ఎమ్మెల్యే ఉండగా ఇన్ ఛార్జి పదవి ఎలా ఇస్తామని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి చేరిక విషయం జగన్ వద్ద పెండింగ్ లో ఉందంటున్నారు. ఇన్ ఛార్జి పదవి కంటే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి ఎప్పుడైనా వైసీపీలో చేరే అవకాశాలయితే పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News