జమ్మలమడుగులో జెండా దించడానికి రీజన్ ఇదే?

ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వారే లేరు. ఉన్న నేతలు పార్టీని వీడివెళ్లిపోయారు. దశాబ్దకాలంగా పార్టీని నమ్ముకుని, పార్టీకి ప్రాణమై నిలిచిన రామసుబ్బారెడ్డిని చేజేతులా [more]

Update: 2020-03-27 13:30 GMT

ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వారే లేరు. ఉన్న నేతలు పార్టీని వీడివెళ్లిపోయారు. దశాబ్దకాలంగా పార్టీని నమ్ముకుని, పార్టీకి ప్రాణమై నిలిచిన రామసుబ్బారెడ్డిని చేజేతులా తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్నట్లయింది. దీంతో జమ్మలమడుగులో ఇప్పుడు జెండా మోసే వారే కరువయ్యారు. మరో నేత ఇక్కడ దొరికే అవకాశమే లేకుండా పోయింది. రామసుబ్బారెడ్డి పార్టీని వీడిన తర్వాత జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్మాష్ అయిపోయిందనే చెప్పాలి.

కఠిన నిర్ణయం వెనక?

నిజానికి రామసుబ్బారెడ్డి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనక అనేక కారణాలున్నాయంటున్నారు. ఆయన తన సన్నిహితులతోనూ, టీడీపీ సీనియర్ నేతలతోనూ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. నిజానికి రామసుబ్బారెడ్డి పార్టీ మారతారని ఎవరూ ఊహించ లేదు. బహుశ చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. అయితే విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు పార్టీ నేతలను కొందరిని రామసుబ్బారెడ్డి వద్దకు పంపారట. స్వయంగా చంద్రబాబు కూడా రామసుబ్బారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.

జైల్లో ఉన్నప్పుడు కూడా…..

అయితే రామసుబ్బారెడ్డి ఒకే విషయాన్ని చెప్పారట. ఎన్టీఆర్ మరణం తర్వాత తమ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని చెప్పారట. అంతేకాదు తనపై కేసులు పెట్టి వేధించిన ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దన్నా వినకుండా చేర్చుకోవడం తనకు బాధ కల్గించిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం పార్టీ కోసం పనిచేస్తే, కేవలం వైసీపీని దెబ్బతీసేందుకు ఆయననను తీసుకువచ్చి మంత్రి పదవి ఇవ్వడం వెనక ఆంతర్యమేంటని ఆ నేతలను రామసుబ్బారెడ్డి నిలదీశారట. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా టీడీపీ పట్టించుకోలేదని కూడా రామసుబ్బారెడ్డి నిష్ఠూరమాడారంటున్నారు.

స్వయంకృతాపరాధమే….?

అవును నిజమే… సుదీర్ఘకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతను కాదని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని అందలమెక్కిస్తే ఎవరికి మాత్రం కడుపు మండదు అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్లిపోయారు. రామసుబ్బారెడ్డి ఆదిని చేర్చుకున్నారన్న కారణంగా జెండాను వదిలేశారు. ఇప్పుడు టీడీపీకి అక్కడ జెండా మోసే వారే కరువయ్యారు. జమ్మలమడుగులో పార్టీ దుస్థితికి మాత్రం చంద్రబాబు స్వయంకృతాపరాధమేనంటున్నారు.

Tags:    

Similar News