పెద్దల సభకు పెద్దాయన…?

పెద్దల సభకు పెద్దాయన వెళ్లేటట్లే కన్పిస్తుంది. ఆయన పేరును జనతాదళ్ ఎస్ దాదాపుగా ఖరారు చేసింది. కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు [more]

Update: 2020-06-08 17:30 GMT

పెద్దల సభకు పెద్దాయన వెళ్లేటట్లే కన్పిస్తుంది. ఆయన పేరును జనతాదళ్ ఎస్ దాదాపుగా ఖరారు చేసింది. కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు గడువు ఇంకా ఉండటంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా మారే అవకాశముంది.

బలాబలాల ప్రకారం…..

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే అధికారంలో ఉన్న బీజేపీకి రెండు స్థానాలను గెలుచుకుంటుంది. బీజేపీకి సభలో 117 మంది సభ్యుల బలం ఉంది. ఇక 68 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకుంటుంది. కానీ రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 34 స్థానాలున్న జేడీఎస్ మరో పది మంది మద్దతు అవసరం అవుతుంది.

కాంగ్రెస్ చేయూతనిస్తేనే?

ఇందుకు కాంగ్రెస్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై జేడీఎస్ చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ తమ మద్దతుపై స్పష్టం చేసింది. తమకు పరిషత్ ఎన్నికల్లో మద్దతిస్తే రాజ్యసభ ఎన్నికల్లో సపోర్టు చేస్తామని చెప్పింది. దీనికి ఓకే అయితే జేడీఎస్ ఒక రాజ్యసభ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అందుకే దేవెగౌడ పేరును జనతాదళ్ ఎస్ రాజ్యసభ స్థానానికి ఖరారు చేసింది. అయితే దేవెగౌడ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అందలేదు.

బీజేపీ ఆ పని చేస్తే…?

గతంలో తాను రాజ్యసభ ఎన్నికలో పోటీ చేయనని దేవెగౌడ ప్రకటించారు. అయినా అవకాశాలుండటంతో ఆయన అవసరం ఢిల్లీలో ఉందని భావించిన పార్టీ ఆయన పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రకటించింది. దీంతో రాజ్యసభ ఎన్నికలు కర్ణాటకలో మరోసారి ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. బీజేపీ ఇద్దరిని కాకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపితే మాత్రం దేవెగౌడ పోటీ చేయరని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద దేవెగౌడ మరోసారి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు రెడీ అయిపోతున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News