రాజీవ్… భ్రష్టుపట్టించారే…!!

ఐఏఎస్, ఐపీఎస్ లు దేశంలో అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారులు. విధి నిర్వహణలో వారు నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యవహరించాలి. అంతిమంగా ప్రజలకు ఎటువంటి నిర్ణయం మేలు చేస్తుదో [more]

Update: 2019-02-19 18:29 GMT

ఐఏఎస్, ఐపీఎస్ లు దేశంలో అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారులు. విధి నిర్వహణలో వారు నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యవహరించాలి. అంతిమంగా ప్రజలకు ఎటువంటి నిర్ణయం మేలు చేస్తుదో అదే చేయాలి. ఎటువంటి ప్రలోభాలకు, రాజకీయ ఒత్తిడులకు లొంగరాదు. అలా వ్యవహరించేందు కోసమే వారి పదవికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నియామకాలు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు వంటి విషయంలో రాష్ట్రాలకు పెద్దగా పాత్ర కల్పించలేదు. చాలా వరకు వీరి వ్యవహారాలు కేంద్రం చేతిలోనే ఉంటాయి. వారి వ్యవహారాలు రాష్ట్రాల చేతుల్లో ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తాబేదార్లుగా , ముఖ్యమంత్రులకు తొత్తులుగా మారిపోతారన్న భయం లేకపోలేదు. అందుకే సివిల్ సర్వీసుల రూపకర్త, దేశ తొలి హోం మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి పదవికి ఎన్నో రక్షణలను కల్పించారు.

ప్రాంతీయ పార్టీలున్న చోట….

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేంద్రంలో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ఒకింత పరవాలేదు. వారికి పెద్దగా ఇబ్బందులు, ఒత్తిడులు లేవు. అదే సమయంలో రాష్ట్రంలో పనిచేసే అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట పరిస్థితి మరింత అద్వానం. గిట్టని, ఎదురుచెప్పే, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయని అధికారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం పరిపాటి అయింది. శంకరగిరి మాన్యాలను పట్టించడం సాధారణమైంది. అదే సమయంలో తనకు తొత్తులుగా వ్యవహరించే వారికి పోస్టింగుల్లో పెద్దపీట వేయడం, వారి అవినీతిని కప్పి పుచ్చడం, వారిని అడ్డంగా వెనకేసుకు రావడం వంటి విషసంస్కృతులు ప్రబలాయి. కోల్ కత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. ముఖ్యమంత్రి తొత్తుగా మారిన రాజీవ్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఉత్తరప్రదేశ్ అధికారి. ప్రస్తుతం అత్యంత కీలక మైన కోల్ కత్తా పోలీస్ కమిషనర్ గా ఉన్నారు.

ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి….

రూర్కీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివిన ఆయనకు టెక్నాలజీపై గట్టి పట్టుంది. ఎలక్ట్రానిక్ సర్వైవలెన్స్ లో దిట్ట. గతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో జాయింట్ కమిషనర్ గా, సీఐడీలో డీజీగా పనిచేశారు. మావోయిస్టులను ఏరివేయడంలో సమర్థంగా వ్యవహరించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయన సాహసవంతమైన అధికారి అని ‘‘డయల్ జీ ఫర్ డాన్’’ అనే పుస్తకంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ కితాబిచ్చారు. ఆయనలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే వారికి అన్ని విధాలుగా అండదండగా ఉండేవారని పేరుంది. ముక్కుసూటి మనిషి. వామపక్ష ప్రభుత్వ అండదండలతో తన ఫోన్ ను ట్యాంపింగ్ చేస్తున్నరని విపక్షంలో ఉండగా మమత బెనర్జీ ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వస్తే ఆయన సంగతి చూస్తానని హెచ్చరించారు కూడా. అయితే ఇదంతా ఇప్పుడు చరిత్ర. మమతకు రాజీవ్ ఇప్పుడు అత్యంత సన్నిహితుడు. కోల్ కత్తాలోని రైటర్స్ బిల్డింగ్ (సచివాలయం) లో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఉంది. నిత్యం మమతతో సమావేశమవుతుంటారు. సాధారణంగా పోలీసు అధికారులకు సచివాలయంలో కార్యాలయాలు ఉండవు. కానీ మమతతో సాన్నిహిత్యం కారాణంగా ఆయనకు తిరుగులేకుండా పోయింది. మమతకు నమ్మిన బంటు. ఈ ఉద్దేశ్యంతోనే శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తునకు ప్రత్యేక అధికారిగా ఆయనను నియమించారు. ఈ కుంభకోణంలో మమత పార్టీ మనుషులకు గట్టి ప్రమేయం ఉంది.

రికార్డులు తారుమారు చేసి…..

సాక్షులను, రికార్డులను తారుమారు చేస్తారన్న ఉద్దేశ్యంతోనే ఆయనకు బాధ్యతలను అప్పగించారన్న ప్రచారం లేకపోలేదు. అధినేత్రి ఆలోచనలకు అనుగుణంగానే రాజీవ్ వ్యవహరించారు. ఈ విషయాన్ని పసిగట్టిన సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి అసాధారణంగా వ్యవహరించి వారిని అడ్డుకున్నారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా చట్టానికి సహకరించడం ప్రతి ఒక్కరి విధి. సీనియర్ పోలీస్ అధికారి అయిన రాజీవ్ కు, సీఎం మమతకు ఈ విషయాలు తెలియనవి కావు. కానీ మమత అనుచితంగా వ్యవహరించాలరు. కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. శారదా కుంభకోణంలో అధికార పార్టీ పెద్దలను కాపాడేందుకు ప్రత్యేక అధికారిగా రాజీవ్ కుమార్ ప్రయత్నించడం వాస్తవం. ఇది వృత్తి విలువలను మంటగలపడమే. అత్యున్నత సివిల్ సర్వీసులకు అప్రదిష్ట కలిగంచే విషయమని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా రాజీవ్ కుమార్ ను ఎన్నికల కమిషన్ ఆధేశాల మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీఐడీ విభాగానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో అనూజ్ శర్మను నియమించింది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News