జగన్ కలల నగరం మీదనే రాజు చూపు ?

ఎదుటి వారిని బాధించాలంటే నేరుగా విమర్శలు చేయాలి. దాని కంటే ఇంకా ఇబ్బంది పెట్టాలంటే వారికి బాగా ఇష్టం అయిన విషయాలను కెలికి వదిలిపెట్టాలి. చీల్చి చేట [more]

Update: 2020-09-12 13:30 GMT

ఎదుటి వారిని బాధించాలంటే నేరుగా విమర్శలు చేయాలి. దాని కంటే ఇంకా ఇబ్బంది పెట్టాలంటే వారికి బాగా ఇష్టం అయిన విషయాలను కెలికి వదిలిపెట్టాలి. చీల్చి చేట చేయాలి. ఈ లాజిక్ కి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బాగానే వంటబట్టించుకున్నారు కాబట్టే ఆయన ఇపుడు విశాఖ మీద తన కెమెరా కన్ను పెట్టారు. విశాఖ జగన్ కి కలల నగరం. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న సిటీ. విశాఖను పాలనారాజధాని చేసుకుని అక్కడికి సీఎం హోదాలో షిఫ్ట్ అయిపోదామని జగన్ తాపత్రయం. చట్టం చేసినా న్యాయ వివాదాలు ఉండడంతో అది ఆగింది.

విశాఖ మీదనే…..

గత రెండు నెలలుగా రాజు గారు విశాఖను ముందు పెట్టి మరీ రాజకీయం ఆడుతున్నారు. విశాఖను పాలనారాజధానిగా ప్రజలు అసలు ఒప్పుకోవడంలేదని ఏకంగా రాజు ఢిల్లీలో కూర్చుని తీర్పు ఇచ్చేశారు. మరి ఆయన ఎపుడు ఏ సర్వే చేశారో తెలియదు కానీ విశాఖ జనాలు రాజధాని అంటే భయపడుతున్నారని కొత్త విషయం బయటపెట్టారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్నది విశాఖ వాసుల మనోగతం అంటూ వారు మెదళ్ళలో దూరి కనుక్కోన్నట్లుగా హస్తినలో కూర్చుని తీరిగ్గా రాజుగారు జోస్యాలు చెబుతున్నారు. ఇది కచ్చితంగా జగన్ కి చికాకు పెట్టే అంశమే.

అది వివాదమేనా…?

విశాఖలో ప్రభుత్వం 30 ఎకరాల్లో ఒక ప్రభుత్వ అతిధి గ్రుహం కట్టాలనుకుంది. దాని కోసం జీవోను ప్రత్యేకంగా విడుదల చేసింది. నిర్మాణం బాధ్యతలను మెట్రో డెవలప్మెంట్ అధారిటీకి అప్పగించింది. దానిమీద కూడా రాజు గారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర మంత్రులను కలసి పురావస్తు ప్రదేశాలు ఉన్న చోట నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసి చక్కా వచ్చారు. దీంతో జగన్ కి ఎక్కడో మండిందని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి.

అశోకే చైర్మన్…..

ఇక సింహాచలం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ కూడా వివాదంలో ఉన్నాయి. సంచయిత గజపతిరాజు ని ఆ సీట్లో వైసీపీ సర్కార్ కూర్చోబెట్టింది. ఇక్కడ కూడా రాజు జోక్యం చేసుకుని ఏకంగా తమ సొంత ప్రభుత్వం మీదనే అతి పెద్ద ఆరోపణ చేశారు. సింహాచలం భూములను వేల ఎకరాలు కొట్టేయడానికే సంచయితను అక్కడ పెట్టారని, మాన్సాస్ ఆస్తులు కూడా హరించడానికి ఇది పక్కాగా వేసిన ప్లాన్ అంటున్నారు. పూసపాటి వారి చరిత్రను మంటగలపడానికి ఇలా వైసీపీ సర్కార్ చేస్తోందని కూడా విమర్శించారు. ఇక అశోక్ గజపతిరాజు మచ్చలేని నేత అని కూడా కితాబు ఇస్తున్నారు. ఆయనే ఇప్పటికీ అసలైన చైర్మన్ అంటూ కొత్త వాదన ముందుకుతెస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టి వైసీపీని బదనాం చేయడానికి రాజు భారీ స్కెచ్ గీస్తున్నారు.

మోజు కాదా…?

విశాఖకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన నోరు చేసుకుని తమ ప్రాంతం మీద పడితే చూస్తూ ఊరుకోమని మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ వైపు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం పనులు చూసుకుంటే మంచిదని కూడా హితవు పలుకుతున్నారు. కానీ ఏకంగా జగన్ని టార్గెట్ చేసిన రఘురాముడు అవంతిని పట్టించుకుంటాడా. ఆయన మాటలు వింటాడా. అది జరిగే పని కాదు, జగన్ మోజు పడిన విశాఖ తనకూ మోజే అంటున్నాడు. విశాఖ రాజకీయాల్లోకి దూరిపోయి మరీ వైసీపీని రచ్చ రచ్చ చేయడమే తన లక్ష్యం అంటున్నారు. మరి ఆయనను జగన్ ఎప్పటిదాకా క్షమిస్తారో చూడాలి.

Tags:    

Similar News