హద్దులు దాటుతున్నారు….వేటు కోసమేనా ?

రఘురామకృష్ణంరాజు హద్దులు దాటేస్తున్నారు. ఆయన అన్ని అంచులూ దాటి ఆవల నిలుచుకున్నారు. జగన్ కి పార్టీకి వీరవిధేయుడనని అంటున్న నోటితోనే అదే జగన్ సర్కార్ని గట్టిగా విమర్శిస్తున్నారు. [more]

Update: 2020-07-28 06:30 GMT

రఘురామకృష్ణంరాజు హద్దులు దాటేస్తున్నారు. ఆయన అన్ని అంచులూ దాటి ఆవల నిలుచుకున్నారు. జగన్ కి పార్టీకి వీరవిధేయుడనని అంటున్న నోటితోనే అదే జగన్ సర్కార్ని గట్టిగా విమర్శిస్తున్నారు. జగన్ కి ప్రాణప్రదమైన మూడు రాజధానుల బిల్లు విషయంలో ఆమోదించవద్దు అని ఏకంగా రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశారూ అంటే రఘురామకృష్ణంరాజు పూర్తిగా తెగించినట్లేనని అంటున్నారు. తాను ప్రభుత్వ విధానాలు విమర్శిస్తున్నానని చెబుతున్న రాజుగారు దేశంలో ఎక్కడైనా అదే పార్టీకి చెందిన వ్యక్తి సొంత ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేయడం చూశారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజు గారి తీరు చూస్తూంటే తాను బయటకు పోతాను, ఆ ఒక్కటీ ఇచ్చేస్తే చాలు అన్నట్లుగా ఉందని అంటున్నారు.

తాడో పేడో …

ఇన్నాళ్ళూ వేరే విషయాలు మాట్లాడుతూ వచ్చిన రఘురామకృష్ణంరాజు ఇపుడు అమరావతి రాజధానిని ఉంచాలని అనడంతో ఆయన పక్కా ప్రతిపక్ష నేత అని చెప్పేసుకున్నట్లు అయింది. మనకు నచ్చినా నచ్చకపోయినా పార్టీలో ఉన్నపుడు నిర్ణయాలను ఆమోదించాల్సిందే. అన్నీ లాజికల్ గా మాట్లాడుతూ తన వాదన రైట్ అని చెప్పుకునే రాజు గారికి ఇంత చిన్న విషయం తెలియదా అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లు తీసుకురావడం మాట తప్పడమేనని కూడా రఘురామకృష్ణంరాజు సూత్రీకరించారు. జగన్ మడమ తిప్పేశాడంటూ గట్టిగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే నేను మీ పార్టీలో ఉండను బాబోయి అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నట్లుగానే అర్ధం చేసుకోవాలేమో.

సహనానికే సవాల్ ….

సాధారణంగా జగన్ ఇలాంటి వాటిని అసలు సహించరు అంటారు. ఆయన తనకు ఎదురు మాట్లాడింతే ఊరుకోరని కూడా చెబుతారు. కానీ దానికి భిన్నంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ ఉందని అంటున్నారు. ఆయన లాజికల్ గా మాట్లాడుతూ ప్రభుత్వాన్నే తాను విమర్శిస్తున్నాను తప్ప పార్టీని ఎక్కడా తప్పుపట్టడంలేదని అంటున్నారు. అంతే కాదు తాను ఒక్కడినే పార్టీని కాపాడుతున్నానని, తప్పులు జరగకుండా చూస్తున్నానని కూడా చెబుతున్నారు. అయితే ఆయన జగన్ మనస్తత్వం తెలిసే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఇన్నాళ్ళూ ఒకలా మాట్లాడిన ఆయన జగన్ కి మరింతగా కోపం తెప్పించడం ద్వారా ఆయన సహనాన్ని పరీక్షించడం చేస్తున్నారు. అలా కనుక చేస్తే ఒక్క వేటు వేస్తారని, దెబ్బకు పార్టీ సంకెళ్ళు తెగుతాయి, బంగారం లాంటి ఎంపీ పదవి కూడా మరో నాలుగేళ్ళ పాటు ఉంటుందని కూడా రఘురామకృష్ణంరాజు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.

కాలుతోందిగా …?

గత ఏడాది జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసుని కూడా రఘురామకృష్ణంరాజు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. ఇక అసలు దోషులకు శిక్ష తప్పదు, ఎవరూ అసలు తప్పించుకోలేరు. అది జరిగేది కూడా కాదు అంటున్నారు. మరి ఆయన అంత డేరింగ్ గా జగన్ సొంత బాబాయి హత్యలో తెర వెనక హంతకులు ఉన్నార‌ని అనడం ద్వారా ఎక్కడో కాలేలాగానే మాట్లాడారు అంటున్నారు. వీటన్నిటి పరమార్ధం ఒక్కటే. అర్జంట్ గా రఘురామకృష్ణంరాజు ని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అదే ఆయన జగన్ నుంచి కోరుకుంటున్నది. మరి జగన్ మాత్రం ఎన్నడూ లేనంత ఓపిక చేసుకుని మరీ అన్నీ భరిస్తున్నారు. రాజు ఎంపీ సీటుకి ఎసరు తేవాలనుకుంటున్నారు. ఈ ఇద్దరి పంతంలో ఎవరు నెగ్గుతారు, రాజు అంతకంతకు రెచ్చి చేస్తున్న విమర్శల ఫలితం ఎలా ఉండబోతోంది అన్న వాటికి సంబంధించి రాజకీయ తెరపైనే సమాధానాలు వెతకాలి.

Tags:    

Similar News