ర‌ఘురామ ప్లేస్‌ను టీడీపీ రాజుతో భ‌ర్తీ చేస్తారా ?

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీ నుంచి గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన ఆయ‌న కొద్ది [more]

Update: 2021-06-04 02:00 GMT

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీ నుంచి గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన ఆయ‌న కొద్ది రోజుల‌కే పార్టీకి, సీఎం జ‌గ‌న్‌కు యాంటీ అయ్యారు. చివ‌ర‌కు ఆయ‌న్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం… త‌న‌ను పోలీసులు కొట్టార‌ని ర‌ఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ఆరోపించ‌డం.. చివ‌ర‌కు ఆయ‌న బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లడం లాంటి ప‌రిణామాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ర‌ఘురామ కృష్ణంరాజుకు వైసీపీకి మ‌ధ్య మామూలు వైరుధ్యం లేదు.

కులాలు, మతాలు….

చివ‌ర‌కు ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర్సెస్ వైసీపీ వివాదంలో కులాలు, మ‌తాల గొడ‌వ‌లు కూడా వ‌చ్చేశాయి. ర‌ఘు సామాజిక వ‌ర్గ‌మైన క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా ర‌ఘురామ‌కు అనుకూలంగా కొంద‌రు, వ్యతిరేకంగా కొంద‌రు చీలిపోయారు. ఇటు జ‌గ‌న్ సైతం గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనే ఈ వ‌ర్గానికి ఎంపీ సీటుతో పాటు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇంత ర‌చ్చ ఏంట‌న్న అస‌హ‌నంలో ఉన్నారు. తాను సామాజిక వ‌ర్గానికి ఇంత చేసినా ర‌ఘురామ కృష్ణంరాజును వాళ్లు క‌ట్టడి చేయ‌లేద‌న్న కోపం అయితే జ‌గ‌న్‌లో ఉంది. ఈ క్రమంలోనే ర‌ఘురామ కృష్ణంరాజుతో పార్టీకి క‌లిగిన న‌ష్టాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన పొలిటిక‌ల్‌గా క్లీన్‌చిట్ ఉన్న మ‌రో నాయ‌కుడితో భ‌ర్తీ చేయాల‌ని పార్టీలో తీవ్రస్థాయిలో త‌ర్జన భ‌ర్జన‌లు జ‌రుగుతున్నాయి.

వీరిపై ఆగ్రహంతోనే….?

ర‌ఘురామ కృష్ణంరాజు విష‌యంలో ఆ సామాజిక వ‌ర్గం నుంచి పార్టీకి అనుకున్న స్థాయిలో స‌పోర్ట్ రాలేద‌న్న ఆవేద‌న అయితే జ‌గ‌న్‌లో ఉంది. పై నుంచి ఆదేశాలు వ‌స్తే త‌ప్పా మంత్రి చెరుకువాడ రంగ‌నాథ రాజు స్పందించ‌ని ప‌రిస్థితి. న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద‌రాజు, ఉండి క‌న్వీన‌ర్‌గా ఉన్న సీవీఎల్‌. న‌ర‌సింహారాజు, న‌ర‌సాపురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోక‌రాజు రంగ‌రాజు లాంటి నేత‌లు ఎవ్వరూ స్పందించ‌లేదు. చివ‌ర‌కు వైజాగ్ నార్త్ క‌న్వీన‌ర్‌గా ఉన్న కెకె. రాజుతో ప్రెస్‌మీట్లు పెట్టించి మ‌రీ ర‌ఘురామ కృష్ణంరాజుకు కౌంట‌ర్ ఇప్పించుకున్నారు. ఈ విష‌యంలో జాతీయ స్థాయిలో ర‌చ్చకు ఎక్కడంపై జ‌గ‌న్ తీవ్ర ఆగ్రహంగానే ఉన్నారు.

ఆయనను పార్టీలోకి….?

ఇదంతా ప‌క్కన పెడితే ఇప్పుడు ర‌ఘురామ కృష్ణంరాజుతో జ‌రిగిన న‌ష్టం భ‌ర్తీ చేసేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ‌ను పార్టీలోకి లాగేందుకు పెద్ద ఎత్తున ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నట్టు జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది. ఉండి నుంచి గ‌తంలో రెండు సార్లు విజ‌యం సాధించిన శివ‌… గ‌త ఎన్నిక‌ల్లో పార్లమెంటుకు పోటీ చేసి ఇదే ర‌ఘురామ కృష్ణంరాజుపై స్వ‌ తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక శివ‌ టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. శివ‌కు వ్యాపార వ్యవ‌హారాల లావాదేవీలు, అనుమ‌తులు రావాల్సిన‌వి కూడా చాలానే ఉన్నాయి.

హామీ ఇస్తే…?

పార్టీ కోసం తాను ఎంతో చేశాన‌ని.. ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు గ‌ట్టి ఫైట్ చేసినా అధికారంలోకి వ‌చ్చాక బాబు న‌న్ను గుర్తించ‌లేద‌న్న ఆవేద‌న శివ‌లో ఎక్కువుగా ఉంది. అదే ఆయ‌న ఇప్పుడు సైలెంట్‌గా ఉండ‌డానికి కార‌ణం. ఇప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాంబాబు పాతుకుపోయి ఉన్నారు. భ‌విష్యత్తులో అయినా శివ టార్గెట్ మంత్రి ప‌ద‌వే అని.. త‌న‌కున్న క్లీన్ ఇమేజ్‌తో వైసీపీ నుంచి ఆ దిశ‌గా హామీలు వ‌స్తే ఆయ‌న పార్టీ మారేందుకు కూడా సిద్ధమే అంటున్నారు. అటు వైసీపీ, ఇటు శివ‌కు ఉన్న అవ‌స‌రాల నేప‌థ్యంలో ప‌శ్చిమ వైసీపీలో ఏదైనా జ‌రిగే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News