లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లేనటగా

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజకీయంగా ఆయన సెటిల్‌ అయినట్టేనా? అన్నదే [more]

Update: 2019-08-13 00:30 GMT

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజకీయంగా ఆయన సెటిల్‌ అయినట్టేనా? అన్నదే ఇప్పుడు ఆయ‌న చుట్టూ న‌డుస్తోన్న హాట్ టాపిక్‌. దీనికి ప్రధాన కారణం.. రాజకీయంగా ఆయన ఎక్కడా స్థిరత్వం లేక పోవడమే. ఆయన గడిచిన ఐదేళ్ల కాలంలో నాలుగు పార్టీలు మారారు. ఒక పార్టీని ఛీకొట్టి.. వెళ్లి.. మళ్లీ అదేపార్టీలోకి తిరిగి వచ్చి ఎంపీగా విజయం సాధించారు. దీంతో రఘురామకృష్ణంరాజు రాజకీయాలపై ఆసక్తిని రేపుతోంది.

కేవీపీ వియ్యంకుడిగా…..

రఘురామకృష్ణంరాజు రాజకీయాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్‌ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావుకు స్వయానా ఈయన వియ్యంకుడు అవుతారు. అదే సమయంలో వైఎస్‌ జీవించి ఉన్న కాలంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు రఘురామకృష్ణంరాజు. తర్వాత కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకివచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనను జగన్‌.. నరసాపురం పార్లమెంటు పార్టీ నియజకవర్గం ఇంచార్జ్‌గా నియమించారు. ఎంపీగా విజయం సాధించాలనే తన రాజకీయ కాంక్షను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించారు.

చివరి వరకూ టీడీపీలో…..

అదే సమయంలో వైసీపీ అధినేత జగన్‌తో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన ఎలాగైనా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరాలని భావించి.. ఆయన టీడీపీవైపు మొగ్గు చూపారు. టీడీపీలో సీటు రాద‌ని డిసైడ్ అయ్యి వెంట‌నే బీజేపీలోకి గోడ దూకేశారు. అయితే, అప్పటికే టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడంతో ఆ ఎన్నికల్లో ఈ టికెట్‌ను బీజేపీ అభ్యర్థికి గోకరాజు గంగరాజుకు కేటాయించారు. అయినా కూడా టీడీపీలోనే ఉన్న రఘురామ కృష్ణం రాజు 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ను కైవసం చేసుకో వాలని భావించారు. అయితే, ఎన్నికలకు ఏడాది ముందుగానే సర్వే చేయించిన చంద్రబాబురఘురామకృష్ణంరాజు గ్రాఫ్‌ బాగోలేదని గుర్తించినట్టు ప్రచారం జరిగింది.

అదే పార్టీలో చేరి…..

దీంతో ఇక ఇక్కడే ఉంటే.. ఈ దఫా కూడా ఆశలు నెరవేరని భావించిన రఘురామకృష్ణం రాజు వెంటనే యూటర్న్‌ తీసుకుని ఏ పార్టీని విభేదించి బయటకు వచ్చాడో అదే పార్టీ వైసీపీలోకి చేరి.. ఎట్టకేలకు టికెట్‌ దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే సొంత గూటికి రావడం తనకు మంచి రిలీఫ్‌గా ఉందని వ్యాఖ్యానించారు. అదే ర‌ఘురామ వైసీపీ నుంచి 2014లో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్‌పై తీవ్రమైన విమ‌ర్శలు చేశారు. జ‌గ‌న్ పైకి క‌నిపించే సెయింట్ లాగా ఉన్నా అత‌డిలో అప‌రిచితుడు ఉన్నాడ‌ని కూడా వ్యాఖ్యానించారు.

అనుమానానికి కారణం…?

తాజాగా జరిగిన ఎన్నికల్లో నరసాపురం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. జనసేన నుంచి మెగా బ్రదర్‌ నాగబాబు, టీడీపీ నుంచి కలువపూడి శివ, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్‌ వంటి వారు పోటీ చేసినా.. 26 వేల ఓట్ల మెజారిటీతో రఘు విజయంసాధించారు. ఎట్టకేలకు పార్లమెంటుకు వెళ్లాల‌నే తన కోరిక నెరవేర్చుకున్నారు. అయితే, గడిచిన ఐదేళ్లలో ఆయన రాజకీయ ప్రస్థానం.. కుదురుకుందా? లేక మళ్లీ జంప్‌లు కొనసాగుతాయా? అనే చర్చ మాత్రం సశేషంగా ఉంది. దీనికి కారణం.. ఆయన ఎంపీ అయిన తర్వాత నేరుగా వెళ్లి జగన్‌ను కలవ కుండా ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీతో కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఆయనకు పుస్తకాలు, శాలువాలు, కానుకలు ఇచ్చి.. మెప్పించారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు రాజకీయం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఊహించలేమని అంటున్నారు పరిశీలకులు. బహుశ ఇలాంటి వారిని చూసుకునే ఏమో.. ఏపీ బీజేపీ నేతలు.. తమకు తిరుగులేదని అంటున్నారు.

Tags:    

Similar News