రాజు గారికి బాజా మోగిందా…?

ఆయన ఘనమైన రాజా వారు. ఎంపీ కావాలని, పార్లమెంట్ గడప తొక్కాలని పదేళ్ల పాటు కన్న కలలు ఎట్టకేలకు వైసీపీ రూపేణా నిజం చేసుకున్నారు. నర్సాపురం ఎంపీగా [more]

Update: 2021-02-24 14:30 GMT

ఆయన ఘనమైన రాజా వారు. ఎంపీ కావాలని, పార్లమెంట్ గడప తొక్కాలని పదేళ్ల పాటు కన్న కలలు ఎట్టకేలకు వైసీపీ రూపేణా నిజం చేసుకున్నారు. నర్సాపురం ఎంపీగా ఎపుడైతే ఢిల్లీలో పాదం మోపారో రూపం వేషం మొత్తం మార్చేశారు. బీజేపీతో పాత పరిచయాలని తిరగతోడి తాను అనధికార బీజేపీ ఎంపీగా చలామణీ అవుతూ వచ్చారు. ఏపీలో ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీకి వెళ్ళి రచ్చబండ పేరిట ప్రతీ రోజూ పంచాయతీలు పెడుతూ పెదరాయుడి టైపులో సొంత పార్టీకే నీతులు చెబుతూ వచ్చారు.

వైసీపీ కోరింది….

ఇక రాజావారి దెప్పులు, విమర్శలు భరించడానికి రెండు చెవులూ కూడా సరిపోక చికాకు పడిపోయిన వైసీపీ అగ్ర నాయకత్వం ఆయన్ని తక్షణం డిస్ క్వాలిఫై చేయమని కోరుతూ ఏకంగా లోక్ సభ స్పీకర్ కి వినతిపత్రం ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను కూడా వాడుకున్నారు. కానీ ఎక్కడ తీగ మీటారో కానీ రఘురామకృష్ణంరాజు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఢిల్లీని కరోనా ఊపేస్తున్న వేళ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి మరీ స్పీకర్ ముంగిట వాలి రాజు గారి మీద యాక్షన్ తీసుకోమని వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటికీ అతీ గతీ లేదు. మొత్తానికి రఘురామకృష్ణంరాజు వైసీపీకి కొరకరాని కొయ్యగానే మారారు.

ఝలక్ ఇచ్చేశారా…?

బీజేపీ తాజాగా తన పార్టీలో చేరిన నిన్నటి టీడీపీ తమ్ముడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఈడీ నోటీసులు ఇప్పించడం ద్వారా తానేంటో చూపించింది. ఇపుడు తమ పార్టీ కాని రఘురామకృష్ణంరాజు మీద యాక్షన్ రెడీ అంటోంది. సీబీఐ దర్యాప్తు సిధ్ధంగా ఉందంటూ రాజు గారికి సరైన తోవ చూపించింది. ధర్మల్ పవర్ ప్రజేక్టుల పేరిట బ్యాంకులలో ఆర్ధిక లావాదేవీలు నడిపి మోసం చేశారన్న అభియోగాలపైన సీబీఐ దర్యాపునకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో రాజు గారి ఢీల్లీ పంచాయతీల కధ ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా ఉంది.

ఇంతే సంగతులా…?

మొత్తానికి రఘురామకృష్ణంరాజు సాధించింది ఏంటీ అంటే తాను గెలిచిన పార్టీ విశ్వాసం, ఓటేసిన ప్రజల నమ్మకం కోల్పోవడం, అదే సమయంలో తాను కాలు పెట్టి సెటిల్ అవాలనుకున్న పార్టీ నుంచి షాకులు తినడం. మరి రాజు గారికి సీబీఐ నోటీసుకు జారీ చేస్తే కనుక ఆయన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎదురుగా హాజరుకావాల్సిందేనా అన్న ప్రశ్న అయితే ఉంది. ఇంత జరిగినా కూడా ఏపీలోని జగన్ సర్కార్ మీద ఫిర్యాదులు చేసేందుకు ఏకంగా ప్రధానిని కలవడానికి రఘురామకృష్ణంరాజు వెళ్లడమే ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. ఏది ఏమైనా తాజా పరిణామాలు వైసీపీ నేతలకు ఫుల్ హ్యాపీగా ఉన్నాయట.

Tags:    

Similar News