జగన్ తప్పు చేస్తున్నారా?

రాజకీయాల్లో నాన్చుడు ధోరణి పనికిరాదు. జగన్ అన్ని విషయాల్లో దూకుడుగా ఉన్నప్పటికీ రఘురామ కృష్ణ రాజు విషయంలో మాత్రం మెతక వైఖరిని కనపరుస్తున్నారు. రఘురామ కృష్ణ రాజు [more]

Update: 2021-07-21 12:30 GMT

రాజకీయాల్లో నాన్చుడు ధోరణి పనికిరాదు. జగన్ అన్ని విషయాల్లో దూకుడుగా ఉన్నప్పటికీ రఘురామ కృష్ణ రాజు విషయంలో మాత్రం మెతక వైఖరిని కనపరుస్తున్నారు. రఘురామ కృష్ణ రాజు ను పార్టీ నుంచి బహిష్కరించకుండా జగన్ తప్పుచేస్తున్నారా? అన్న చర్చ మొదలయింది. ఇప్పటికే రఘురామ కృష్ణ రాజు ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే ఆయన చేసిన ఆరోపణలకు, రాస్తున్న లేఖలకు విలువ ఉండేది కాదన్నది సీనియర్ నేతల అభిప్రాయం.

ఏడాదిన్నర నుంచి…

రఘురామ కృష్ణ రాజు ఏడాదిన్నర నుంచి వైసీపీకి శత్రువుగా మారారు. ఆయనపై కేసులు పెట్టి వేధించంతో రాజుకు మరింత సానుభూతి పెరిగిందే తప్ప జగన్ కు ఒరిగిందేమీ లేదు. ఆయన గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇరకాటంలో పెడుతున్నా ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా వైసీపీ నేతలకు విసుగు పుడుతుంది. తొలినాళ్లలో కొంత రఘురామ కృష్ణ రాజుపై ఎదురుదాడికి దిగిన వైసీపీ నేతలు ఆపై సైలెంట్ అయ్యారు.

వేటు విషయం?

ఇక ఆయనపై అనర్హత వేటు విషయం ఎప్పుడు తేలుతుందో తెలియదు. పార్లమెంటు సమావేశాల్లోనూ రఘురామ కృష్ణ రాజు జగన్ కు ఇబ్బంది కరంగా మారనున్నారు. ప్రతి రోజూ టీడీపీ వాయిస్ తో రఘురామ కృష్ణ రాజు మీడియా ముందుకు వస్తున్నా వైసీపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. వైసీపీ ఎంపీగానే ఆయన విమర్శలు చేస్తుండటం పార్టీకి, వ్యక్తిగతంగా జగన్ కు ఇబ్బందిగా మారింది.

బహిష్కరించడమే మేలా?

అదే రఘురామ కృష్ణ రాజును పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన విమర్శలకు విలువ లేకుండా పోతుంది. ఆయన కూడా ఇక విమర్శలు మానేసి తన దారి తాను చూసుకుంటారు. కాకుంటే పార్టీకి ఒక ఎంపీ సంఖ్యాపరంగా తగ్గుతారు. అంతకు మించి ఎలాంటి నష్టం ఉండదు. కానీ జగన్ మాత్రం రఘురామ కృష్ణ రాజు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా రఘురామ కృష్ణ రాజు ను పార్టీ నుంచి బహిష్కరిస్తేనే మేలు అన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.

Tags:    

Similar News