పీవీ పుణ్యంతోనే నేడు వారంతా?

పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బహుభాషా వేత్త, సాహితీ స్రష్ట, సంస్కరణ శీలి, సరీళీకృత, పారిశ్రామిక విధానాల పితామహుడు. ఈ కోణంలోనే జాతి ఆయనను గుర్తుంచు [more]

Update: 2020-08-05 16:30 GMT

పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బహుభాషా వేత్త, సాహితీ స్రష్ట, సంస్కరణ శీలి, సరీళీకృత, పారిశ్రామిక విధానాల పితామహుడు. ఈ కోణంలోనే జాతి ఆయనను గుర్తుంచు కుటుంది. స్మరించుకుంటుంది. కానీ ఆయన గురించి తెలియని పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. ఏ పదవి చేపట్టినా ఆ రంగంలో సంస్కరణలకు కృషి చేశారు. తన పదవి ద్వారా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లోనే సీట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయించి సంచలనం కలిగించారు. రాజ్యాధికారంలో వారికి భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతో సాహసోపేతంగా వ్యవహరించారు. నాటి ఆయన నిర్ణయం పార్టీలోని ఆధిపత్య సామాజిక వర్గాలకు రుచించలేదు. అయినప్పటికీ ముందుకే వెళ్లారు. 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా అయిదేళ్ల పదవీకాలంలో ఇదే ఒరవడిని కొనసాగించారు. మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికి బడుగు, బలహీన, అప్పసంఖ్యాక వర్గాలు, మహిళల అభ్యున్నతికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయి. తద్వారా ఆయా వర్గాల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్నాయి.

జాతీయ మానవ హక్కుల సంఘం….

పదవిని చేపట్టిన తొలినాళ్లలో మైనారిటీల హక్కులు, సంక్షేమంపై దృష్టి సారించారు. వారి హక్కులను పరిరక్షించేందుకు సామాజికంగా, ఆర్థికంగా వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని తలంచారు. ఆ ఆలోచనలో భాగంగానే జాతీయ మానవ హక్కుల సంఘాన్నిి 1993 అక్టోబరు 12న ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి. పోలీసులు, భద్రతా బలగాల చేతుల్లో దాడులకు గురైన వారు, నిస్సహాయులు కమిషన్ ను ఆశ్రయించి న్యాయం పొందే అవకాశముంది. . బాధితుల తరుపున పోలీసులను ప్రశ్నించే అధికారం ఈ కమిషన్ కు ఉంటుంది. ఎప్పటికప్పుడు హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా హెచ్.సి. దత్తు వ్యవహరిస్తున్నారు. కర్ణాటకకు చెందిన దత్తు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దేశంలో సగం మంది మైనారిటీలే. వారి అభ్యున్నతి, హక్కుల పరిరక్షణకు సరైన వేదికలు లేవు. ఫలితంగా పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో భాగస్వామ్యులు కాలేకపోతున్నారు. 1992లో జాతీయ మైనారిటీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లిలంను దీని పరిధిలోకి చేర్చారు. దేశ వ్యాప్తంగా మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వారి అభ్యున్నతికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఛైర్మన్ గా ఘమోదల్ హసన్ వ్యవహరిస్తున్నారు. ముజిత్ సింగ్ రాయ్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంకా ఇతర సభ్యులు కమిషన్ లో ఉన్నారు.

మహిళల సంక్షేమం కోసం….

ఆకాశంలో సగం.. అవకాశాల్లో అధమం అన్నది మహిళలకు సంబంధించిన ఆవేదన. దేశ జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేవు. వారి హక్కుల పరిరక్షణకు చట్టబద్ధమైన సంస్థలు లేవ. వారి ఎదుగుదలకు ప్రభుత్వ పరంగా చట్టబద్ధ సంస్థలు లేవు. ఈ లోపాన్ని గుర్తించిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1992 జనవరి 31న జాతీయ మహిళ కమిషన్ ను ఏర్పాటు చేశారు. మహిళలపై గృహహింస తదితర కేసులను ఈ కమిషన్ విచారిస్తుంది. ప్రస్తుతం ఈ కమిషన్ ఛైర్మన్ గా రేఖాశర్మ వ్యవహరిస్తున్నారు. జాతీయ మహిళ కమిషన్ స్ఫూర్తితో రాష్ట్రాల్లోనూ కమిషన్ లు ఏర్పాటయ్యాయి. ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ఉన్నారు. త్రిపురాన వెంకటరత్నం 2018లో పదవీ విరమణ చేశాక ఆమె స్థానంలో తెలంగాణ మహిళ ఛైర్ పర్సన్ గా ఎవరినీ నియమించలేదు. ప్రత్యేకంగా ముస్లిం, మైనారిటీల అభ్యున్నతి కోసం పీవీ నరసింహారావు 1994 సెప్టంబరు 30న నేషనల్ మైనారిటీ డెవెలెప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. వృత్తి, వ్యాపారాల్లో మైనారిటీలు రాణించేందుకు, నిలదొక్కుకునేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. రుణాల మంజూరు ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు తోడ్పాటును అందిస్తుంది.

వికలాంగుల సంక్షేమం కోసం…

వికలాంగుల సంక్షేమం, వారికి చేయూతనందించేందుకు పీవీ నరసింహారావు 1995లో దివ్యాంగుల కోసం చట్టం తీసుకు వచ్చారు. 1996 ఫిబ్రవరి 7వ తేదీన ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఫలితంగా వికలాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 3 శాతం రిజర్వేషన్ లభించింది. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నేషనల్ బ్యాక్ వర్డ్ ఫైనాన్స్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను 1992 జనవరిలో పీవీ నరసింహారావు ఏర్పాటు చేశారు. వారి సంక్షేమానికి కృషి చేయడం దీని లక్ష్యం. సఫాయి కార్మికుల సంక్షేమం కోసం 1994 ఆగస్టు 14న నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా సమాజంలో అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాక, పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల జీవితాల్లో వెలుగు నింపేందుకు పీవీ నరసింహారావు తన హయాంలో కృషిచేశారు. అయితే ఈ అంశాలు అంతగా వెలుగులోకి రాలేదు. ప్రచారానికి దూరంగా ఉండే స్వభావం గల పీవీ నరసింహారావు వీటి గురించి పట్టించుకోలేదు. పనిచేయడమే తన పని అని ఆయన భావించే వారు. నేటి తరానికి, నాటి తరానికి అదే తేడా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News