కోడలికి ఎసరుపెట్టేందుకు కుటుంబమంతా ఒక్కటయ్యారుగా?

విజయనగరం జిల్లాకు ఉన్న ఏకైన ప్రత్యేకత ఏంటి అంటే రాజులూ వారి సంస్థానాలూ అని చెబుతారు. విజయన‌గరం పూసపాటి రాజులతో మొదలుపెడితే బొబ్బిలి రాజులు, కురుపాం రాజులూ [more]

Update: 2021-03-01 06:30 GMT

విజయనగరం జిల్లాకు ఉన్న ఏకైన ప్రత్యేకత ఏంటి అంటే రాజులూ వారి సంస్థానాలూ అని చెబుతారు. విజయన‌గరం పూసపాటి రాజులతో మొదలుపెడితే బొబ్బిలి రాజులు, కురుపాం రాజులూ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే వీరంతా ప్రజాస్వామ్య యుగంలో కూడా జనం గుండెల్లో దేవుళ్ళుగా మారి మంత్రులుగా దశాబ్దాలుగా అధికారాన్ని చలాయిస్తూ వస్తున్నారు. ఇక రాజులంతా 2019 ఎన్నికల్లో కట్టకట్టుకుని సైకిలెక్కేశారు. కానీ ఓట్లేసే ప్రజలు మాత్రం వైసీపీ వైపు నిలవడంతో వారి కోటలకు బీటలు వారాయి.

చిచ్చు అదేనా …?

ఇక విజయ‌గరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి ఆమె సొంత మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజుకు అసలు పడడంలేదు. మామను పక్కన పెట్టి కోడలు రాజకీయంగా ముందుకు దూసుకుపోవడంతో విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య ఏకంగా వైసీపీ సర్కార్ మీద, తన సొంత కోడలి మీద ఆరోపణలు చేస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో కురుపాం వారి కోటలో చిచ్చు రాజుకుంది.

అదీ అసలు కధ ….

ఎక్కడి నుంచో వచ్చిన కోడలు రాజ్యం చేస్తూంటే తాము ఇంతటి రాజకీయ సీనియర్లుగా ఉండి మాజీలుగా మిగిలిపోవడం సొంత మామ చంద్రశేఖరరాజుకు అసలు గిట్టకుండా ఉందిట. అదే విధంగా ఆయన అన్నయ్య, ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా కోడలి మీద రాజకీయంగా పగ పట్టారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన సొంత చెల్లెలుని పోటీకి పెట్టి కోడలిని ఓడించాలని చూసినా కుదరలేదు. అంతకు ముందు ఒకసారి ఆయన మేనల్లుడు జనార్ధన్ ధాట్రాజ్ కురుపాం ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన ఈ మధ్యనే చనిపోయారు. ఇపుడు కోడలికి వ్యతిరేకంగా మరో సారి కుటుంబం అంతా ఒక్కటిగా నిలిచింది అంటున్నారు.

ఇంటి పోరేనా…?

నిజానికి చంద్రశేఖరరాజు హవా ఎపుడో ముగిసింది. ఆయన వైఎస్సార్ టైం లో ఒకసారి నాగూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత కనుమరుగు అయ్యారు. టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి వైసీపీలో చేరిన చంద్రశేఖరరాజుకు తన కూతురు ఎమ్మెల్యే కావాలని ఉందని అంటున్నారు. కోడలి ప్లేస్ లో కూతురుని ఎమ్మెల్యేని చేసి తన ఇంటి గడప అధికారం దాటకుండా చూడాలని ఆయన ఆరాటం. ఈ కారణంగానే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు. ఇక తన సొంత అన్నయ్య ఉన్న టీడీపీలోకి మళ్ళీ వెళ్తారని అంటున్నారు. ఎటూ ధాట్రాజ్ జనార్ధన్ చనిపోయిన కారణంగా టీడీపీకి అక్కడ లీడర్ షిప్ లేదు, దాంతో కూతురికి బాబు టికెట్ హామీ ఉంటే సైకిల్ ఎక్కాలన్నది ఆలోచనగా ఉందిట. మొత్తానికి కురుపాం కోటలో వచ్చిన విభేదాలతో ఇపుడు డిప్యూటీ సీఎం ఆమె భర్త పరీక్షిత్ రాజు ఒంటరి అయ్యారా అన్న చర్చ సాగుతోంది. అయితే జనం మద్దతు మాత్రం పుష్ప శ్రీవాణికే ఎక్కువగా ఉండడంతో ఆమె మీద పోటీ చేసి గెలవడం శత్రుచర్ల ఫ్యామిలీ తరం కాదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News