ప్రియాంకపైనే భారం

భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రియాంక గాంధీ దిక్కయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో ఇంకా ఆ పదవిపై అనిశ్చితి నెలకొంది. ఈ [more]

Update: 2019-07-15 17:30 GMT

భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రియాంక గాంధీ దిక్కయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో ఇంకా ఆ పదవిపై అనిశ్చితి నెలకొంది. ఈ పదవిని సోనియాగాంధీకి అప్పగించాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను తిరిగి చేపట్టేందుకు కొంత సుముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని సయితం పార్టీకి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

సరైన నేత లేకపోవడంతో…..

ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం, అతి పెద్ద రాష్ట్రం కావడంతో ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోకసభ స్థానాలున్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు సాధిస్తేనే ఢిల్లీ పీఠం దక్కుతుందన్నది అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినింది.

గత ఎన్నికలలో బాధ్యతలను అప్పగించినా….

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకగాంధీని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లోని 40 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జిగా నియమితులయ్యారు ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ ప్రచార బాధ్యతలన్నింటినీ చేపట్టినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్ధానం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అదీ సోనియా గాంధీ పోటీ చేసిన రాయరేలీలో మాత్రమే. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేధీలో సయితం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

ఉప ఎన్నికల్లో…..

దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు, త్వరలో జరగనున్న 12 శాసనసభ స్థానాల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అందువల్లనే ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ గా నియమించారు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పొత్తు ఉన్నా లేకున్నా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే ప్రియాంక గాంధీ ముందున్న లక్ష్యం. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ భారాన్ని ప్రియాంక గాంధీపైనే పెట్టారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి తక్షణం 12 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి.

Tags:    

Similar News