దీదీ గిఫ్ట్…. మరి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా?

ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి వరకూ కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. 2019 ఎన్నికల వరకూ ఆయన పెద్దగా రాజకీయాల జోలికి పోలేదు. రాజకీయ అంశాలను కూడా [more]

Update: 2020-03-01 16:30 GMT

ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి వరకూ కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. 2019 ఎన్నికల వరకూ ఆయన పెద్దగా రాజకీయాల జోలికి పోలేదు. రాజకీయ అంశాలను కూడా పట్టించుకోలేదు. అయితే జనతాదళ్ యు ఉపాధ్యక్షుడు అయిన తర్వాతనే ప్రశాంత్ కిషోర్ జాతీయ అంశాలపై కామెంట్స్ చేస్తున్నారు. పౌరసత్వ చట్ట సవరణపై ఆయన నిత్యం బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీహార్ నుంచి బరిలోకి దిగాలని ప్రశాంత్ కిషోర్ భావించారు.

జేడీయూ పదవి చేపట్టిన తర్వాత….

కానీ సీఏఏ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఫ్రీ బర్డ్ అయ్యారు. బీహార్ లో బీజేపీ, జేడీయూ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఆయన తలమునకలై ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి నేరుగా వస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా 2014 ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆరేళ్ల తర్వాత పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు.

రాజ్యసభకు పంపాలని….

పశ్చిమ బెంగాల్ నుంచి ప్రశాంత్ కిషోర్ ను రాజ్యసభ కు పంపనున్నట్లు వార్తలు వస్తున్నాయ. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీని ధీటుగా ఎదిరిస్తూ, అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీని వరసగా ఓడిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభ పదవిని మమత బెనర్జీ గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఖాళీ అవుతున్న నాలుగు సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది. రాజ్యసభకు మమత బెనర్జీ నామినేట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ రాజ్యసభలోకి అడుగు పెట్టినట్లే.

బీజేపీ వ్యతిరేకి కాబట్టేనా?

నిజానికి ప్రశాంత్ కిషోర్ పై మమత బెనర్జీకి ప్రత్యేకమైన అభిమానమంటూ ఏమీ లేదు. అమిత్ షా కారణంగానే జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ సస్పెన్షన్ కు గురయ్యారని, బీజేపీని వ్యతిరేకించే గళానికి ఊతమివ్వాలన్న ఉద్దేశ్యంతోనే మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రశాంత్ కిషోర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీకి అధికారాన్ని అందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద వస్తున్న వార్తలు నిజమైతే ప్రశాంత్ కిషోర్ తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నట్లే లెక్క.

Tags:    

Similar News