పీకే ప్లాన్ అదేనటగా

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే అంశం చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపైనే డిస్కషన్ అంతా. ఈ నెల 18వ తేదీన తాను బిగ్ అనౌన్స్ [more]

Update: 2020-02-16 17:30 GMT

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే అంశం చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపైనే డిస్కషన్ అంతా. ఈ నెల 18వ తేదీన తాను బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ ప్రకటన ఏమై ఉంటుందన్న ఉత్కంఠ రాజకీయ పార్టీల్లో నెలకొని ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఢిల్లీలో ఆప్ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది.

జేడీయూ నుంచి…..

ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి వరకూ జనతాదళ్ యు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. బీహార్ రాజకీయాలను నితీష్ కుమార్ తదనంతరం తాను శాసించాలని ప్రశాంత్ కిషోర్ భావించారు. అందుకే కొంత దూకుడుగా వెళ్లారు. ప్రధానంగా సీఏఏ, ఎన్సార్సీ విషయంలో ప్రశాంత్ కిషోర్ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో బీజేపీ, జేడీయూ ప్రభుత్వం ఉన్నా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని తెలిసినా ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడిగా చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి.

నితీష్ అంటే ప్రేమేనట….

దీంతో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన చేయబోయే ప్రకటన బీహార్ గురించి అయింటుందా? లేక జాతీయ స్థాయికి సంబంధించిన ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే రాష్ట్రీయ జనతాదళ్ నేతలు సంప్రదించారు. అయితే ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఇష్టపడకపోవచ్చంటున్నారు. నితీష్ కుమార్ తనను సస్పెండ్ చేసినా ఆయనపై ప్రశాంత్ కిషోర్ కు ప్రేమ, గౌరవం ఎక్కువని చెబుతారు. అందుకే జాతీయ స్థాయి ప్రకటన అయిఉంటుదని భావిస్తున్నారు.

ఫ్రంట్ ఏర్పాటులో…..

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సీఏఏకు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను కూడగట్టి ఒక ఫ్రంట్ లాగా ఏర్పాటు చేయాలన్నది ప్రశాంత్ కిషోర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం మమత బెనర్జీని ముందుంచి అన్ని పార్టీలతో సంప్రదింపులు తానే చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కాకుండా ప్రాంతీయ పార్టీలతోనే ఫ్రంట్ ను రూపొందించాలన్నది ప్రశాంత్ కిషోర్ ప్రయత్నంగా తెలుస్తోంది. మరి ఇందులో వ్యూహకర్త ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News