హిస్టరీ క్రియేట్ చేస్తారా….??

ప్రకాష్ రాజ్….. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు అత్యంత సుపరిచితుడు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన ప్రతిభ బాలీవుడ్ కూ విస్తరించింది. [more]

Update: 2019-05-19 17:30 GMT

ప్రకాష్ రాజ్….. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు అత్యంత సుపరిచితుడు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన ప్రతిభ బాలీవుడ్ కూ విస్తరించింది. కుటుంబ పెద్దగా ప్రేమాభిమానాలను పండిస్తాడు. అమాయకుడిగా అందరి మన్ననలను పొందుతారు. తనదైన హాస్యాన్ని పండిస్తారు. అదే సమయంలో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల మన్ననలను పొందగలరు. ప్రేమ, దయ, జాలి, కరుణ, అమాయకత్వం, విలనిజాన్ని పండించగలడు. ఆయన నటించడు. ఆయన పాత్రల్లో జీవిస్తాడు. లీనమై పోతాడు అన్నది నిజం.

రాజకీయ రంగంలోనూ….

చలన చిత్ర రంగంలో సత్తా చాటిన ప్రకాష్ రాజ్ రాజకీయ రంగంలోనూ రాణించాలానుకున్నారు. ఇందులో భాగంగా 17వ సార్వత్రిక ఎన్నికల్లోకి దిగారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్ సభలో ప్రకాశించేందుకు పోరాడారు. జాతీయ పార్టీలను ముఖ్యంగా బీజేపీని చీల్చి చెండాడే ప్రకాష్ రాజ్ లౌకిక వాది. ఏ విషయాన్ని అయినా హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తన అభిప్రాయాలను వెల్లడించడంలో నిక్కచ్చిగా ఉంటారు. కొండను ఢీకొనేందుకు అయినా సిద్ధపడతారు. నేరుగా దేశ ప్రధానిపైనే విమర్శలు సంధించగల దమ్ము,ధైర్యం ఎంతమందికి ఉంటుంది..? అందునా సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి దేశ అత్యున్నత అధికార నేతల్నే ఢీకొనడం మాటలా?

స్వతంత్ర అభ్యర్థిగా….

బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్హద్ లను ఢీకొంటున్నారు. బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో మోహన్ కు 5.57 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ కు 4.19 లక్షల ఓట్లు , ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి వి.బాలకృష్ణన్ కు 39 వేలు ఓట్లు వచ్చాయి. జనతాదళ్ ఎస్ అభ్యర్థి నందినీ కి కేవలం 20 వేల ఓట్లు మాత్రమే రావడం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో సర్వాన్న నగర్, సీివీ రామన్ నగర్, శుభీనగర్, శాంతినగర్, గాంధీనగర్ రాజాజీ నగర్, చామరాజ పేట, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో మహాదేవపుర, సివీ రామనగర్ ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలు కావడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009 లో బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం ఆవిర్భవించింది. బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాలను విభజించి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మైనారిటీ ఓటర్ల ఆధిక్యం ఇక్కడ ఎక్కువ. భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. 5.5 లక్షల మంది తమిళులు, 4.5 లక్షల మంది ముస్లింలు, 2 లక్షల మంది క్రిస్టియన్లు ఉన్నారు. జైనులు, మార్వాడీలు కూడా ఉన్నారు. శివాజీ నగర్, గాంధీనగర్, శేషాద్రిపురంలో తమిళుల ఆధిక్యం ఎక్కువ. మధ్య తరగతితో పాటు బస్తీ ప్రజలు సయితం ఉన్నారు.

సంచలనమేనని…

ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తే అదో సంచలనం అవుతుంది. ఇప్పటి వరకూ కర్ణాటక చరిత్రలో ఇద్దరు స్వతంత్రులు మాత్రమే గెలుపొందారు. 1957లో బీజాపూర్ నుంచి సుగంధి మురుగపు సిద్ధప్ప విజయం సాధించారు. పదేళ్ల తర్వాత 1967లో మైసూరు నుంచి దినకర్ దేశాయ్ ఎన్నికయ్యారు. తాజాగా ప్రకాష్ రాజ్ గెలిస్తే మూడో వారు అవుతారు. ప్రకాష్ రాజ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కోసం ప్రచారం నిర్వహించారు. ప్రకాష్ రాజ్ విన్నూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఆటోలు, రిక్షాలు, సైకిళ్లపై ప్రచారం చేశారు. ద్విచక్ర వాహనంపై ఇంటింటికీ తిరిగారు. భారీ సభల కన్నా ఇంటింటికి తిరిగి ఓటర్లను ఆకట్టుకోవడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పెద్దగా హడావిడి లేనప్పటికీ ప్రజల్లోకి వెళ్లారన్న పేరు తెచ్చుకున్నారు ఆయన. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రకాష్ రాజ్, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్విన్ తనకు ధీటైన అభ్యర్థులు కారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం గాలి వీచిందని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉందని పీసీ మోహన్ విశ్వాసం. ఈసారి కాం్గరెస్ అభ్యర్థి రిజ్విన్ కు జనతాదళ్ ఎస్ మద్దతు ఇస్తుండటంతో కమలానికి ఒకింత నష్టమేనన్నది రాజకీయ పండితుల అంచనా. పదేళ్లుగా పీసీ మోహన్ పనితీరు అంత గొప్పగా ఏమీ లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ అభ్యర్థి గెలుపు అంత తేలిక కాదు. ప్రకాష్ రాజ్ విజయం సాధించే అవకాశాలనూ తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News