కక్కలేక‌.. మింగ‌లేక‌.. ప్రభాక‌ర్‌ చౌద‌రి పాలిటిక్స్

అనంత‌పురం జిల్లా టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న ప్రభాక‌ర‌చౌద‌రి పాలిటిక్స్ డోలాయ‌మానంలో ప‌డ్డాయా ? ఆయ‌న ఏం చేయాల‌నే విష‌యంపై ఏమీ తేల్చుకోలేక పోతున్నారా ? టీడీపీలోనూ [more]

Update: 2020-09-15 00:30 GMT

అనంత‌పురం జిల్లా టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న ప్రభాక‌ర‌చౌద‌రి పాలిటిక్స్ డోలాయ‌మానంలో ప‌డ్డాయా ? ఆయ‌న ఏం చేయాల‌నే విష‌యంపై ఏమీ తేల్చుకోలేక పోతున్నారా ? టీడీపీలోనూ ఇమ‌డ‌లేక పోతున్నారా? స్థానిక నేత‌లు క‌లిసి రావ‌డం లేదా ? అంటే.. ఔన‌నే ఆన్సర్లే స్థానికంగా వినిపిస్తున్నాయి. గ‌తంలో అనంత‌పురం మునిసిప‌ల్ చైర్మన్‌గా ప‌నిచేసిన ప్రభాక‌ర్ చౌద‌రి.. అనంత‌పురం అర్బన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో టీడీపీ త‌ర‌పున గెలుపు గుర్రం ఎక్కారు. వివాదాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయ‌న ఎన్నో సేవా కార్యక్రమాలు చేప‌ట్టి పార్టీల‌కు అతీతంగాని మంచి గుర్తింపు పొందారు. ఇక ఎమ్మెల్యే అయ్యాక ప్రభాక‌ర‌చౌద‌రి కార్యక‌ర్తల్లోనూ గుర్తింపు సాధించారు. అర్బన్‌లో అభివృద్ది ప‌నులు చేప‌ట్టారు. చంద్రబాబు ద‌గ్గర కూడా మంచి మార్కులు సంపాయించుకున్నారు.

జేసీ వర్గం పట్టు వదలకుండా….

అయితే, గ‌త ఏడాది ఓట‌మి త‌ర్వాత ప్రభాక‌ర్ చౌద‌రి ప‌రిస్థితి గంద‌ర‌గోళంలో ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గంపై జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు, అనంత‌పురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ప‌వ‌న్ కుమార్‌రెడ్డి ప‌ట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. జేసీ ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ ఆయ‌న గ్రూపు బ‌లంగా ప‌నిచేసింది. దీంతో జేసీ వ‌ర్సెస్ ప్రభాక‌ర్ చౌద‌రి వ‌ర్గాలు అధికారంలో ఉన్నప్పుడు చివ‌రి మూడేళ్లు త‌గ‌వులాడుకుంటూనే ఉన్నాయి. ఎన్నికల వేళ జేసీ అయితే ప్రభాక‌ర్ చౌద‌రికి సీటు ఇవ్వొద్దని కూడా చంద్రబాబు వ‌ద్ద ప‌ట్టుబ‌ట్టారు. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలో లేక‌పోయినా.. వైసీపీ నేత గెలుపు గుర్రం ఎక్కినా.. ఇక్కడ ప‌నులు, అధికారులు దాదాపుగా ఇప్పటికీ జేసీ అనుకూల వ‌ర్గంగానే కొన‌సాగుతున్నారు.

ఏ కార్యక్రమం చేపట్టినా…..

ఇటీవ‌ల‌ అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఒక‌రిద్దరు అధికారుల‌ను కూడా ఇక్కడ నుంచి మార్చారు. అయితే, వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. టీడీపీ మాజీ ఎమ్మల్యేగా ప్రభాక‌ర్ చౌద‌రి ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఏ కార్యక్రమం చేస్తున్నా.. ప‌వ‌న్ కుమార్ రెడ్డి అడ్డుత‌గులుతున్నార‌ని ప్రభాక‌ర్ చౌద‌రి అనుచ‌రులు చెబుతున్నారు. ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నికల్లో త‌న వ‌ర్గానికి 10 కార్పొరేట‌ర్ టిక్కెట్లు ఇవ్వాల‌ని ప‌వ‌న్‌కుమార్ డిమాండ్ చేసినా ప్రభాక‌ర్ చౌద‌రి ప‌ట్టించుకోలేదు.

బాబు జోక్యం చేసుకున్నా….

ఇరు ప‌క్షాల మ‌ధ్య గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఒక‌సారి చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకుని ప‌రిస్థితిని చ‌క్కదిద్దారు. కానీ, త‌ర్వాత మాత్రం మ‌ళ్లీ య‌థాత‌థంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి కొన‌సాగుతోంది. ఇక‌, ఓడిపోయిన త‌ర్వాత కూడా త‌మ‌దే పైచేయి అనేలా జేసీ వ‌ర్గం వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో ఇప్పుడు ప్రభాక‌ర్ చౌద‌రి ఏం చేయాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని అంటున్నారు. గ‌త ఎన్నికల్లోనూ టౌన్‌లో ఉన్న జేసీ వ‌ర్గం ప్రభాక‌ర్ చౌద‌రికి స‌పోర్ట్ చేయ‌లేదు. దీనిపై ప్రభాక‌ర్ చౌద‌రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

బాబు ఆ భయంతో…..

ఇప్పుడున్న ప‌రిస్థితిలో జేసీ వ‌ర్గాన్ని అదుపు చేయ‌డం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని అదుపు చేస్తున్నార‌నే ప్రచారం జ‌రిగితే.. పార్టీకి రెడ్డి వ‌ర్గం దూర‌మ‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే ఆయ‌న ఈ విష‌యంలో ఆచితూచి వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభాక‌ర్ చౌద‌రి వ్యవ‌హారాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్రస్థాయిలో త‌ర్జన భ‌ర్జన‌కు గుర‌వుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News