సునీత కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. ఒంట‌రైపోయారుగా?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎవ‌రూ ఊహించ‌లేరు. ఏ నిముషానికి ఎలా మార‌తాయో చెప్పడమూ క‌ష్టమే. సో.. ఎంత సీనియ‌ర్ నాయ‌కుడికైనా.. ఆలోచించి అడుగులు వేయ‌డం మంచిది. [more]

Update: 2021-01-04 00:30 GMT

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎవ‌రూ ఊహించ‌లేరు. ఏ నిముషానికి ఎలా మార‌తాయో చెప్పడమూ క‌ష్టమే. సో.. ఎంత సీనియ‌ర్ నాయ‌కుడికైనా.. ఆలోచించి అడుగులు వేయ‌డం మంచిది. కానీ, దుందుడుకు వ్యూహాలు.. ప‌స‌లేని ఫీట్లతో ఎవ‌రు అడుగులు వేసినా.. క‌ష్టాలు కొని తెచ్చుకోవ‌డ‌మే. ఇప్పుడు ఇలానే ఉంది ప్రకాశం జిల్లా చీరాల‌కు చెందిన మ‌హిళా నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ పోతుల సునీత వ్యవ‌హారం. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో ఆమె దూకుడు వేరేగా ఉండేది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా మంచి గ్రిప్ తెచ్చుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా టీడీపీ సీటు ద‌క్కించుకున్న ఆమె ఆ ఎన్నిక‌ల్లో ఆమంచి కృష్ణమోహ‌న్ చేతిలో ఓడినా రెండో స్థానంలో నిలిచారు.

ఆమంచితో విభేదించి…..

పోతుల సునీత ఓడినా పార్టీ అధికారంలో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న మాట‌కు ఎదురు లేకుండా పోయింది. టీడీపీ అంటే త‌నే .. అన్నట్టుగా ఆమె చ‌క్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ప‌ద‌వి సొంతం చేసుకోవ‌డంతో పాటు పార్టీలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేప‌థ్యంలో పోతుల సునీత వేసిన అడుగులు రాంగ్ ప‌డ్డాయి. పైగా.. ఆమె జట్టు క‌ట్టిన కూట‌మి కూడా ఆమెకు సెగ పెడుతోంది. చీరాల నుంచి 2014లో గెలిచిన ఆమంచి కృష్ణమోహ‌న్‌.. టీడీపీలో చేర‌డం తెలిసిందే. అయితే.. త‌న అవ‌కాశాలు దెబ్బతీస్తున్నార‌నే ఉద్దేశంతో పోతుల సునీత‌.. ఆమంచితో తీవ్రంగా విబేధించారు.

కరణం నుంచే…..

ఇది ఆ ఒక్కపార్టీలో ఉండ‌గానే స‌రిపెట్టలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోవ‌డంతో ఆమె వైసీపీలో చేరారు. త‌న‌కు ఎమ్మెల్సీ వంటి ప‌ద‌విని అప్పగించి.. గౌర‌వించిన టీడీపీకి గుడ్‌బై చెప్పి ఏదో సాధించాల‌ని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ.. ఇక్కడ ఆమె పూర్తిగా ఒంట‌రి అయిపోయారు. ఆమంచి వ్యతిరేక వ‌ర్గంగా ఉన్న పోతుల సునీత‌కు.. మునుపు ఉన్న బ‌లం, దూకుడు.. క‌నిపించ‌డం లేదు. పైగా.. ఆమంచి వ్యతిరేక వ‌ర్గంగా ఉన్న క‌ర‌ణం.. గ్రూపుతో చేతులు క‌లిపి.. మ‌రింత బ‌ల‌హీన ప‌డ్డార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా క‌ర‌ణం బ‌ల‌రాం నుంచే తీవ్రమైన అవ‌మానం ఎదుర్కొనాల్సి వ‌చ్చింది.

కరణాన్ని విభేదిస్తూ…..

క‌ర‌ణం వ‌ర్గీయుడిగా ఉన్న పాలేటి రామారావు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ నుంచి క‌ర‌ణం పోటీ చేస్తార‌ని చేసిన వ్యాఖ్యల‌ను సునీత తీవ్రంగా విబేధించారు. అయితే క‌ర‌ణం కూడా రామారావును స‌మ‌ర్థిస్తూ పోతుల సునీతపై ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో పాటు ట్యూన్ మార్చేశావంటూ మండిప‌డ్డారు. ఏకంగా ఎమ్మెల్యే క‌ర‌ణం.. పోతుల‌ను వేదిక‌పైనే 'కూర్చోవ‌మ్మా.. కూర్చో!.. ఏంటి నువ్వు చెప్పేది. బుద్ధుందా!“ అంటూ.. ఏవ‌గించుకుని.. చేత్తో వెన‌క్కి లాగేసి.. కుర్చీలో కూల‌దోయ‌డం.. నిజంగా పోతుల ఒంట‌రి అయిపోయార‌నే వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

ఇప్పుడు ఒంటరిగా మారి….

ఈ స‌మ‌యంలో వేదిక‌పై మాజీ మంత్రి పాలేటి రామారావు, క‌ర‌ణం.. ఇంత‌గా అవ‌మానించినా.. పోతుల సునీతను స‌మ‌ర్థించిన వారు.. అయ్యో పాపం .. మ‌హిళ అని జాలి చూపిన వారు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ ప‌రిణామాలు, సునీత ను ఒంట‌రిని చేశాయ‌నే భావ‌న వ్యక్తం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వ‌ర‌కు ఆమంచి వ్యతిరేకంగా పోతుల సునీత కూడా క‌ర‌ణంకే జై కొట్టగా ఇప్పుడు క‌ర‌ణం చాలా తెలివిగా ఆమెను సైడ్ చేస్తోన్న ప‌రిస్థితే చీరాల‌లో ఉంది.

Tags:    

Similar News