Ponguleti : పొంగులేటి పక్క చూపులు చూస్తున్నారా?

మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్క చూపులు చూస్తున్నట్లే ఉంది. వచ్చే ఎన్నికల సమయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ మేరకు ఆయన [more]

Update: 2021-10-11 11:00 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్క చూపులు చూస్తున్నట్లే ఉంది. వచ్చే ఎన్నికల సమయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీగా తన క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జరుగుతున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

టీఆర్ఎస్ లో చేరి…

పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఇచ్చింది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీగానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని ఆయన రూపొందించుకున్నారు.

ఒంటరిగానే….

టీఆర్ఎస్ రాజ్యసభ పదవి కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తి ఎక్కువయింది. దీంతో పాటు జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు సయితం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లైట్ గా తీసుకుంటున్నారు. పొంగులేటి వర్గానికి పదవులు ఇచ్చేది లేదని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు నామా నాగేశ్వరరావు సయితం పొంగులేటి వర్గానికి పదవులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

అసంతృప్తి తీవ్రమై…..

ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. తాను ఎక్కడికైనా వెళ్తానని, తన వెంట వచ్చిన వారి పదవులు పీకేస్తామంటే ఊరుకోబోనని, ఇక్కడ శీనన్న బ్రాండ్ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి నామానాగేశ్వరరావు ధీటుగానే స్పందించారు. ఇక్కడ ఎవరి బ్రాండ్ లేదని, ఉన్నదంతా కేసీఆర్ బ్రాండ్ అని అన్నారు. తనను పార్టీ నేతలు ఇబ్బంది పెడుతుండటాన్ని ఇప్పటికే హైకమాండ్ దృష్టికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News