అక్కడ మళ్లీ ఎవరికి వారే

భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం అర్థమయినప్పటికీ విపక్షాల్లో ఐక్యత కన్పించే పరిస్థితి లేదు. ఢిల్లీకి [more]

Update: 2019-08-18 18:29 GMT

భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం అర్థమయినప్పటికీ విపక్షాల్లో ఐక్యత కన్పించే పరిస్థితి లేదు. ఢిల్లీకి ఆనుకుని ఉండే హర్యానా రాష్ట్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అలాగే బీజేపీ ఎటూ ఒంటరిగానే ఇక్కడ బరిలోకి దిగనుంది.

బీజేపీ, జేజేపీ పొత్తు….

90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. జననాయక్ జనతా పార్టీ తో బీఎస్పీ పొత్తు ఖరారయింది. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీని అధికారంలోకి దించాలంటే విపక్షాలన్నీ ఏకమవ్వాల్సి ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా, అధికార పార్టీ మీద అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలంటే ఏకమవ్వాల్సిన సమయంలో ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంది.

కాంగ్రెస్ తో పొత్తుతో….

ఇప్పటికే మాయావతి, జననాయక్ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. యాభై స్థానాల్లో బీఎస్పీ, 40 స్థానాల్లో జేజేపీలు పోటీ చేస్తాయని ప్రకటించారు. జననాయక్ జనతా పార్టీ ఓంప్రకాశ్ చౌతాలా కుమారుడు. ఆయన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ని స్థాపించారు. ఇప్పుడు ఈ పార్టీకి ఓంప్రకాష్ చౌతాలా మరోకుమారుడు అభయ్ సింగ్ సారథ్యం వహిస్తున్నారు. ఇద్దరూ జాట్ సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గంలో ఓట్లు చీలే అవకాశముంది.

బీజేపీ ఒంటరిగా….

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభయ్ సింగ్ సారథ్యంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీతో పొత్తుపెట్టుకోనుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమయింది. 75 స్థానాలను సాధించాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ హర్యానాకు ఇన్ ఛార్జిగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను నియమించింది. మొత్తం మీద హర్యానాలో మళ్లీ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో భారతీయ జనతా పార్టీకే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News