చూడబోతే బాబుకే మోడీ గిఫ్ట్ ఇస్తారా ?

నరేంద్ర మోడీ. చాణక్య రాజకీయం అంటే ఆయనదే మరి. ఎవరెవరో అపర చాణక్యుడు అని చెప్పుకుంటారు. మోడీ బయటకు చెప్పుకోరు అంతే. లేకపోతే ఎక్కడి గుజరాత్ లోని [more]

Update: 2020-10-24 00:30 GMT

నరేంద్ర మోడీ. చాణక్య రాజకీయం అంటే ఆయనదే మరి. ఎవరెవరో అపర చాణక్యుడు అని చెప్పుకుంటారు. మోడీ బయటకు చెప్పుకోరు అంతే. లేకపోతే ఎక్కడి గుజరాత్ లోని బీజేపీ పార్టీ నేత మరెక్కడి ముఖ్యమంత్రి పదవి, ఇంకెక్కడి ప్రధాని పదవి. ఇవన్నీ కాదు, మరో సారి పీఎం అయి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకే జమిలి ఎన్నికలకు చాలా వేగంగా పరుగులు పెడుతున్నారు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. జమిలి ఎన్నికల సిద్ధాంతం అచ్చంగా బీజేపీ. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఇది కదా కాషాయ సిద్ధాంతం. మరిపుడు దేశంలో చాలా బలంగా బీజేపీ ఉంది. ఇపుడు కాకపోతే మరెపుడు అని కూడా అంటోంది.

తొలి అడుగేనా…..?

తాజాగా ప్రధాని ఆఫీసులో ఒక మీటింగ్ జరిగిందిట. ఆ మీటింగ్ లో ఒకే ఓటర్ లిస్ట్ దేశమంతా అమలు కావాలని నిర్ణయించారని చెబుతున్నారు. అంటే లోక్ సభకు వాడిన ఓటింగ్ లిస్ట్ నే అసెంబ్లీకి లోకల్ బాడీ ఎన్నికలకు కూడా వాడుతారు అన్న మాట. మరి ఇది జమిలి ఎన్నికలకు తొలి మెట్టు అని చెబుతున్నారు. అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా లోకల్ బాడీ ఎన్నికల జాబితా కూడా ఎటువంటి సవరింపులు లేకుండా ఒక్కటే ఉండబోతోంది అన్నమాట. మరి దీనికి రాష్ట్రాలు ఎంతవరకూ అంగీకరిస్తాయి అన్నది చూడాలి. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తిగా ఆయా రాష్ట్రాల ఇష్టం. కానీ ఇపుడు ఆ అధికారం పోతోంది. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేసుకుని అధికార పార్టీలు చేసే విన్యాసాలు కూడా పోతాయి. ఇదంతా మోడీ సర్కార్ కొత్త అజెండాగా మారబోతోంది

కచ్చితంగా అటే…..

ఇక ఏదో విధంగా ఒకే ఓటర్ల జాబితాను ఆమోదించాలని బీజేపీ చూస్తోంది. దేశంలో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణను కూడా తీసుకురాబోతోందని కూడా అంటున్నారు. ఆ తతంగం ఎటూ పూర్తి అయ్యేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు అంటున్నారు. అది కనుక జరిగితే జమిలి ఎన్నికలు మరింత తొందరగా తోసుకువస్తాయి. ఇక 2022లో దాదాపు గా పది రాష్ట్రాలకు దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2023 నాటికి మరి కొన్ని రాష్ట్రాలో ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ముందుకు తెచ్చో వాయిదా వేసో 2022లో ఎన్నికలు పెట్టాలని మోడీ సర్కార్ చాలా చురుకుగా పావులు కదుపుతోంది అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ అధికారం కచ్చితంగా రెండేళ్ళు పోతుంది అని అంటున్నారు.

బాబు హ్యాపీ……

ఒక విధంగా చంద్రబాబును రాజకీయ అదృష్టవంతుడు అని చెప్పుకోవాలేమో. 2024 వరకూ ఎన్నికలకు ఆగకుండా మోడీ కనుక 2022లోనే ఎన్నికలు పెడితే ఆయన ఇంకా బలంగా ఉండగానే మరో ఛాన్స్ వస్తుంది. ఎన్నికల సమరంలో పోరాడి విజేత అయ్యేందుకు బంగారం లాంటి అవకాశం దక్కుతుంది. ఇక జగన్ కి అచ్చంగా మరో ఏడాదిన్నర కాలం మాత్రమే మిగులుతుంది కాబట్టి ఆయన ఈ అతి తక్కువ కాలంలో ఏ రకమైన అభివృద్ధి చూపించకపోతే కచ్చితంగా అది బాబుకే మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మోడీ జగ‌న్ పక్షం అని అంతా రుసరుసలాడుతున్నా ఆయన ఏరి కోరి బాబుకే అతి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోడుతున్నారని తాజా పరిణామాలు చూస్తే తెలుస్తోంది. మరి చూడాలి ఇలాగే జరుగుతుందా లేదా అన్నది.

Tags:    

Similar News