జ‌గ‌న్‌కు మోడీ షాక్‌.. ఏ రేంజ్‌లో అంటే..?

అస‌లే ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌తం అవుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీవ్ర దెబ్బ వేసేసింది. ఇప్పటికే నిధులు తెచ్చుకోలేక‌ అప్పులు కూడా పుట్టక‌.. [more]

Update: 2021-07-29 12:30 GMT

అస‌లే ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌తం అవుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీవ్ర దెబ్బ వేసేసింది. ఇప్పటికే నిధులు తెచ్చుకోలేక‌ అప్పులు కూడా పుట్టక‌.. నానా ర‌కాలుగా తిప్పలు ప‌డుతున్న జ‌గ‌న్ ప్రభుత్వం ముందర కాళ్లకు బంధాలు వేసేసింది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తుంది ? ఎలా ముందుకు వెళ్తుంది ? ఏవిధంగా దీని నుంచి బ‌య ట‌కు వ‌స్తుంది ? అనే అంశాలు చాలా ఆస‌క్తిగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి అనేక రూపాల్లో నిధులు అందుతూ ఉంటాయి. వీటిలో కొన్ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు సంబంధించినవి కూడా ఉంటాయి.

సహజంగా చేసేవే అయినా…?

కేంద్రం యునానిమ‌స్‌గా కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటికి సంబంధించి.. కొన్నింటికి పూర్తిగా కేంద్రమే నిధులు ఇస్తుండ‌గా.. కొన్ని ప‌థ‌కాల‌కు మాత్రం రాష్ట్రాలు త‌మ వాటాను జోడించి.. ఆయా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాలి. వీటిని ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌.. త‌దిత‌ర ప‌థ‌కాలు ఉన్నాయి. అయితే.. ఇలా కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు ఇస్తున్న నిధుల‌ను దేశంలోని చాలా రాష్ట్రాలు త‌మ అవ‌స‌రాల‌ను బ‌ట్టి.. వేర్వేరుప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నాయి. గ‌తంలో చంద్రబాబు హ‌యాంలోనూ కేంద్రం ఇచ్చిన నిధుల‌ను వేర్వేరు ప‌థ‌కాల‌కు మ‌ళ్లించిన చ‌రిత్ర ఉంది. ఇది స‌హ‌జంగా అన్ని రాష్ట్రాలూ చేసేవే.

వేరే పథకాలకు మళ్లిస్తే….

ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌లు.. రాష్ట్ర ప్రభుత్వాల‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్రం ఇస్తున్న నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని.. దీంతో కేంద్రానికి పేరు రావ‌డం లేద‌ని.. నాయ‌కులు పెద్ద పెట్టున ఆరోప‌ణ‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు అలెర్ట్ అయింది. తాము ఇస్తున్న ప‌థ‌కాల నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌రాద‌ని నిర్దేశించింది. కొన్నాళ్ల కింద‌ట సీఎంల‌తో స‌మావేశం నిర్వహించిన ప్రధాని మోడీ.. దీనిపై వారికి దిశానిర్దేశం చేశారు. “మీ ప‌థ‌కాల‌కు మీ నిధులు వాడుకోండి. మా ప‌థ‌కాల కు మేం ఇస్తున్న నిధుల‌ను దారిమ‌ళ్లించ‌కండి' అంటూ.. హిత‌వు ప‌లికారు.

నిధులను వెనక్కు తీసుకుంటామంటూ….

అయితే.. ఇది సాధార‌ణంగా కేంద్రంలోని ఏ ప్రభుత్వమైనా.. చెప్పే సంగ‌తేన‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా మోడీ ఇప్పుడు రాష్ట్రాల‌కు అలెర్ట్ పంపించారు. తాము ఇస్తున్న నిధుల‌ను త‌మ ప‌థ‌కాల‌కు మాత్రమే ఖ‌ర్చు చేయాల‌ని.. లేక‌పోతే.. స‌ద‌రు నిధుల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని మోడీ హెచ్చరించారు. దీనికి సంబంధించి ఏపీతో స‌హా 20 రాష్ట్రాల‌కు లేఖ‌లు రాశారు. దీనిపై ఏపీ ఇంకా స‌మ్మతి తెలియ‌జేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్రం 25% లోపు మాత్రమే నిధుల్ని రాష్ట్రాల‌కు ఇస్తుంది.

ఖర్చు చేయకపోతే..?

రాష్ట్రం తన వాటా నిధులను కూడా జతచేసి అందులో 75% ఖర్చు చేసిందని నిర్ధారించుకున్న త‌ర్వాతే మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఒక‌వేళ ఏవైనా కార‌ణాల‌తో నిధులు ఖ‌ర్చు చేయ‌క‌పోతే మాత్రం …ఆ సొమ్మంతా తిరిగి నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాల్సి చేయాల్సి వుంటుంది. ఇది రాష్ట్రాల‌కు పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఏపీ వంటి ఆర్థిక స‌మ‌స్యల‌తో ఇబ్బంది ప‌డుతున్న రాష్ట్రానికి శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి.

అంగీకరిస్తే….?

ఎందుకంటే..కేంద్రం ఇస్తున్న ప‌థ‌కాల నిధుల‌ను వేరే కార్యక్రమాల‌కు మ‌ళ్లిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. మ‌రి ఈ నేప‌థ్యంలో దీనికి క‌నుక జ‌గ‌న్ అంగీక‌రిస్తే.. రాష్ట్రం మ‌రిన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవ‌డం ఖాయం. అలాగ‌ని అంగీక‌రించ‌క‌పోతే.. కేంద్రం ఆగ్రహానికి గురికావాల్సి వ‌స్తుంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ తీవ్ర సంక‌ట‌స్థితిని ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News