Pithani : పితాని నిలువరించేందుకు ఏం చేయాలి?

పాలిటిక్స్ లో అన్ని రోజులు ఒకేలా ఉండవు. బలమైన నేత ఉన్న చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆచంట నియోజకవర్గాన్ని గుప్పిట పట్టిన పితాని సత్యనారాయణ [more]

Update: 2021-09-28 13:30 GMT

పాలిటిక్స్ లో అన్ని రోజులు ఒకేలా ఉండవు. బలమైన నేత ఉన్న చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆచంట నియోజకవర్గాన్ని గుప్పిట పట్టిన పితాని సత్యనారాయణ మళ్లీ పట్టు పెంచుకుంటున్నారు. ఆచంటలో ఆయన హవా తిరిగి మొదలయిందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించినా ఆచంటలో మాత్రం చతికల పడింది. ఒక ఎన్నిక ఫలితంతో పరిస్థితిని అంచనా వేయలేం కాని, ఆచంటలో మాత్రం వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే చెప్పాలి.

సీనియర్ నేతగా….

పితాని సత్యనారాయణ ఆషామాషీ నేత కాదు. పెనుగొండ, ఆచంట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రి పదవిని అనుభవించారు. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన తొలుత వైసీపీలో చేరాలనుకుని 2014లో ఆయన టీడీపీలో చేరి తిరిగి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా ముందు ఆయన ఓటమి పాలయ్యారు.

మంత్రిపై అసంతృప్తి….

ప్రస్తుతం ఆచంటకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాధరాజు పై ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడిందని చెప్పవచ్చు. దీనికితోడు పితాని సత్యనారాయణ కూడా మంచి ఎఫెర్ట్ పెట్టారు. గత ఎన్నికల్లో తనకు దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకున్నారనే చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పితాని సత్యనారాయణ కొంతకాలం పార్టీకి దూరంగానే ఉన్నారు. అయితే ఆయన కుటుంబంపై ఈఎస్ఐ అవినీతి ఆరోపణలు వచ్చినప్పటి నుంచి యాక్టివ్ అయ్యారు.

జాగ్రత్త పడకపోతే…?

ఆచంటలో జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో పితాని సత్యనారాయణ ముందు వైసీపీ అభ్యర్థి ఎవరైనా తలవంచక తప్పదు. ఇప్పటి నుంచే ఆచంటలో వైసీపీ ముందస్తు చర్యలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ కోరుతుంది. ఇక్కడ పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని క్యాడర్ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద ఆచంటలో పితాని సత్యనారాయణ తన పట్టు చూపించారు. ఆచంట జడ్పీటీసీని, ఎంపీటీసీలో ఆరింటిని గెలుచుకుని ఆయన వైసీపీకి సవాల్ విసిరినట్లే అనుకోవాలి.

Tags:    

Similar News