వైసీపీ, టీడీపీ నేతలయినా వీరి బంధం మాత్రం?

సాధార‌ణంగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? నేత‌ల మ‌ధ్య సాన్నిహిత్యం ఎలా ఉంది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే .. సొంత పార్టీ నేత‌లే ఒక‌రిపై [more]

Update: 2020-07-13 05:00 GMT

సాధార‌ణంగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? నేత‌ల మ‌ధ్య సాన్నిహిత్యం ఎలా ఉంది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే .. సొంత పార్టీ నేత‌లే ఒక‌రిపై ఒక‌రు ఆడిపోసుకునేందుకు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు అని చెప్పక త‌ప్పదు. ప‌ద‌వుల నుంచి పంప‌కాల వ‌ర‌కు నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు రంజుగానే సాగుతున్నాయి. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. ఈ రెండు పార్టీల‌ నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అంటే.. ప‌్రత్యేకంగా చెప్పేదేముంటుంది ? ఉప్పు-నిప్పు మాదిరిగా గిల్లి క‌జ్జాలు పెట్టుకుంటూ.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటూ.. స‌వాళ్లు రువ్వుకుంటూ.. మీడియాకు బైట్‌లు ఇస్తూ.. ముందుకు సాగుతున్నార‌నే చెప్పాలి. కానీ, రాష్ట్రం మొత్తంగా ఇదే ప‌రిస్థితి ఉందా ? అంటే.. లేదు. కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయ‌కులు.. ప్రస్తుతం అధికార పార్టీ లో ఉన్న నాయ‌కులు చెట్టాప‌ట్టాలేసుకుని ముందుకు సాగుతున్నారు.

ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్….

ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణాజిల్లా కేంద్రం మ‌చిలీపట్నం రాజ‌కీయాల‌ను తీసుకుంటే.. ఇక్కడ ఆస‌క్తిక‌ర ప‌రిణామం క‌నిపిస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ.. కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కు, ఇక్కడ నుంచి విజ‌యం సాధించి, జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పుతున్న పేర్ని నానికి మ‌ధ్య మంచి సంబంధాలే కొన‌సాగుతుండ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. కొన‌క‌ళ్లకు మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కొన‌క‌ళ్ల త‌న సంబంధాన్ని నానితోనూ కొన‌సాగిస్తున్నా రు. ఒక్కమాట‌లో చెప్పాలంటే.. ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవ‌చ్చు. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. ఒక‌రిపై ఒక‌రికి మ‌మ‌కారం ఎక్కువ‌. గ‌తంలో పేర్ని నాని కాంగ్రెస్‌లో ఉండేవారు. కొన‌క‌ళ్ల నారాయ‌ణ టీడీపీలో ఉన్నారు. 2009లో కొన‌క‌ళ్ల మ‌చిలీప‌ట్నం ఎంపీగాను, పేర్ని మ‌చిలీ ప‌ట్నం నుంచి ఎమ్మెల్యేగాను పోటీ చేసి విజ‌యం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఇద్ద‌రూ విజ‌యం సాధించినా స్టేట్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అంత‌‌కు ముందే పేర్ని నాని 2004లో కాంగ్రెస్ నుంచి మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా…..

అయితే, వీరిద్దరూ వేర్వేరు పార్టీలైన‌ప్పటికీ.. ఎంపీ ఓటును కొన‌క‌ళ్లకు వేయ‌మ‌ని నాని, ఎమ్మెల్యే ఓటును పేర్నికి వేయ‌మ‌ని కొన‌క‌ళ్ల ప్రచారం చేసేవార‌ని ఇక్కడి ప్ర‌జ‌లు చెప్పుకొంటారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో పేర్ని నాని ఓడిపోయారు. కానీ, కొన‌క‌ళ్ల మ‌ళ్లీ ఎంపీగా విజ‌యం సాధించారు. దీంతో ఒక‌రికొక‌రు సాయం చేసుకున్నారు. పైగా ఒక‌రిపై ఒక‌రు ఎప్పుడూ విమ‌ర్శలు చేసుకున్న ప‌రిస్థితి లేదు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పేర్ని నాని గెలిచారు. కొన‌క‌ళ్ల ఓడిపోయారు. దీంతో పేర్ని ఇప్పుడు అన్ని విధాలా కొన‌క‌ళ్లకు సాయం చేస్తున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో కొన‌క‌ళ్ల పేర్ని నానిని ఎక్కడా ఎప్పుడూ విమ‌ర్శించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, అదే టీడీపీకి చెందిన మ‌రో నేత‌, మాజీమంత్రి కొల్లు ర‌వీంద్ర మాత్రం పేర్ని నానిని విమ‌ర్శించడం, స‌వాళ్లు రువ్వడం తెలిసిందే. దీంతో నాని కూడా కొల్లుపై ప్రతి విమ‌ర్శలు చేయ‌డం స‌వాళ్లు రువ్వడ‌మూ తెలిసిందే. కానీ, పేర్ని-కొన‌క‌ళ్ల మాత్రం వైరానికి దూరంగా స్నేహానికి ద‌గ్గర‌గా రాజ‌కీయాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. టీడీపీ మాజీ ఎంపీ.. వైసీపీ మంత్రిగారికి మ‌ధ్య సాగుతున్న జిగిరీ దోస్తానా..!!

Tags:    

Similar News