విశాఖ ప్రశాంతతను చెడగొడుతోంది ఎవరు…?

విశాఖను చూస్తే కవిత్వం అదే వస్తుంది అంటారు. దానికి రాజకీయ నేతలు కూడా అతీతులు కారేమో. అందుకే విశాఖ రాగానే చంద్రబాబు నోటి వెంట అలవోకగా అద్భుతమైన [more]

Update: 2021-03-20 14:30 GMT

విశాఖను చూస్తే కవిత్వం అదే వస్తుంది అంటారు. దానికి రాజకీయ నేతలు కూడా అతీతులు కారేమో. అందుకే విశాఖ రాగానే చంద్రబాబు నోటి వెంట అలవోకగా అద్భుతమైన పద బంధాలు అలా దొర్లుతూంటాయి. విశాఖ సుందరమైన నగరం, ప్రశాంత నగరం అంటూ కధ మొదలుపెడతారు. ఇక్కడ ప్రజలు మంచివారు అంటూ కీర్తిస్తారు. అటువంటి విశాఖ ప్రశాంతతను చెడగొడుతున్నారని, పులివెందుల పంచాయతీలు తెచ్చిపెడుతున్నారంటూ బాబు ప్రత్యర్ధుల పదునైన విమర్శలు సంధిస్తారు. వైసీపీ మీద రాజకీయ ఆరోపణలు చేయడానికి విశాఖను అలా వాడుకుంటారు.

శాంతికి మారు పేరు …?

ఇదే మాటను వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ శాంతికి పెట్టింది పేరు. విశాఖలో ఉన్న వారంతా సాధు స్వభావులు. అటువంటి విశాఖ నగరానికి గట్టి మేలు మేము తలపెడితే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గర్జిస్తున్నారు. విశాఖకు ఏకంగా రాజధాని తీసుకువస్తూంటే చంద్రబాబు మోకాలడ్డుతున్నాడని ఘాటు విమర్శలే చేస్తున్నారు. విద్వంస శక్తులను విశాఖవాసులు దూరంగా ఉంచాలని వైసీపీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. విశాఖ నుంచి టీడీపీని తరిమికొట్టాలని కూడా పిలుపు ఇస్తున్నారు.

బలమైన పోరుతో ….

నిజానికి విశాఖ ప్రగతి అంతా సహజసిధ్ధంగానే జరిగింది. ఇక్కడి ప్రకృతి అందాలు, అనుకూలమైన వాతావరణం చూసే పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇతర కేంద్ర పరిశ్రమలు కానీ వచ్చాయన్నది తెలిసిందే. ఇక అభివృద్ధి మాటున విశాఖలో రాజకీయమూ ప్రవేశించింది. 1983 దాకా ఒక ఎత్తుగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక నాన్ లోకల్స్ లీడర్స్ విశాఖ రాజకీయాల్లొకి రావడం మొదలైంది. అలా టీడీపీతోనే ఏకపక్షంగా విశాఖ రాజకీయం సాగుతున్న వేళ 2014 నుంచి వైసీపీ రూపంలో ఆ పార్టీకి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అలా రెండు బలమైన ప్రాంతీయ పార్టీల పోరులో విశాఖ నలిగి విలవిలలాడుతోంది అంటే సబబుగా ఉంటుందేమో.

అదే పరిష్కారమా..?

విశాఖ వాసులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎక్కడైనా జనం అదే కోరుకుంటారు. కానీ నాన్ లోకల్ లీడర్స్ వలస వచ్చిన వారు పెత్తనం చేయడం వల్లనే అసలైన ముప్పు ఏర్పడుతోందని మేధావులు కూడా అంటున్నారు. విశాఖ జనం మౌనంగా ఉంటే అమాయకులుగానే జమ కడతారు. పైగా వారు తాము సొంతంగా బలమైన నాయకత్వాన్ని రూపొందించుకోకుండా వలస నాయకుల కొమ్ము కాయడం వల్లనే ప్రశాంత నగరం ఇపుడు సలసల మండుతోందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. విశాఖలో లోకల్ లీడర్ షిప్ బలంగా ఉంటేనే తప్ప అసలైన శాంతి చేకూరదని కూడా సూచిస్తున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా సిటీ ఆఫ్ డెస్టినీని చేసి మీ తల రాత ఇదే అని చెబుతున్నారు. ఆ జాతకం మారాలంటే అమాయకులు అన్న ట్యాగ్ ని విశాఖ వాసులు పక్కన పెట్టి చైతన్యవంతులు కావాలని అంతా కోరుతున్నారు.మరి అది జరిగేపనేనా. రాజకీయ పెద్దలు జరగనిస్తారా..

Tags:    

Similar News