కరోనా కు తెరతీస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ ?

ఏప్రిల్ నెల వరకు రండి బాబు రండి వ్యాక్సిన్ లు వేయించుకోండి కరోనా ను కట్టడి చేయండి అని పదేపదే ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అయినా జనం వింటేగా [more]

Update: 2021-05-10 09:30 GMT

ఏప్రిల్ నెల వరకు రండి బాబు రండి వ్యాక్సిన్ లు వేయించుకోండి కరోనా ను కట్టడి చేయండి అని పదేపదే ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అయినా జనం వింటేగా అది మాకోసం కాదన్నట్లు ఇప్పటివరకు కరోనా సోకని వారు భావిస్తే వచ్చి తగ్గిన వారెమో తమలో యాంటీ బాడీస్ ఉన్నందున టీకా పని లేదనుకున్నారు. ఇక టీకా లపై ప్రసార మాధ్యమాలు సైతం భయాందోళనలు కలిగించే వార్తలను ప్రసారం, ప్రచురితం చేయడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకనే సాగింది. దాంతో కేంద్రం టీకా వారోత్సవాలు ప్రకటించి ఎక్కువమందికి వ్యాక్సిన్ వేసే ప్రయత్నం చేసినా అది కొంతమేరకు మాత్రమే ఫలించింది. ఐతే సెకండ్ వేవ్ ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడుతూ దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసులు అధికారికంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతుంటే భయపడిన ప్రజల్లో టీకా పై చైతన్యం తుఫాన్ లా వెల్లివిరిసింది. ఫలితంగా ఒక్కసారిగా ప్రజలు టీకా ల కోసం క్యూ లు కాదు తన్నుకు చచ్చే పరిస్థితి ప్రతీ చోటా దారుణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కరోనా కట్టడి కి అందరికి టీకాలే మార్గం అని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం పెద్ద గందరగోళమే సాగుతుంది.

పద్ధతి పాడు లేదుగా …?

ఇక దేశంలో టీకా పై ప్రజలు అనాసక్తి చూపిస్తున్నారని భావించిన కేంద్రం విదేశాలకు కోట్లాదిగా ఎగుమతులు చేసేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో ఆ గొప్ప కాస్తా స్వదేశం లో అపవాదుగా,అప్రదిష్ఠగా మోడీ సర్కార్ పీకకు గట్టిగానే చుట్టుకుంది. పైగా కేంద్రానికి ఒక ధర, రాష్ట్రానికి మరోలా, ప్రైవేట్ కి ఇంకోలా అంటూ వ్యత్యాసాలు ఉండటం తీవ్ర విమర్శలకు తెరతీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డిమాండ్ బారెడు ఉత్పత్తి మూరెడు గా టీకా లు అందుబాటులో ఉన్నాయి. దాంతో ప్రతీ టీకా కేంద్రం లో ప్రజల తాకిడికి తలలు పట్టుకుంటున్నారు సిబ్బంది, అధికారులు . కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ లు సైతం చేసే దుస్థితి దాపురించింది. ఇది పరోక్షంగా కరోనా వ్యాప్తికి దారితీసేలా మారింది. వచ్చిన స్టాక్ వందల్లో ఉంటే వేలమంది టీకా కావాలంటున్నారు. అప్పటికి రెండో డోస్ వారికి ప్రాధాన్యత అని చెబుతున్నా ఆ కొద్ది మందికి సరిపడా వ్యాక్సిన్ లు అందుబాటులో లేవు. ఎపి ప్రభుత్వం నాలుగు కోట్ల టీకా లకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనా ఇచ్చే నాధుడే లేడు.

ఎపి లో వాలంటీర్ వ్యవస్థను …

దేశంలో ఏ రాష్ట్రం లో లేని యంత్రాంగం జగన్ సర్కార్ సొంతమని చెప్పొచ్చు. ట్రయిల్ రన్ లో భాగంగా టీకా ఉత్సవ్ లో రోజుకు ఆరులక్షల డోస్ లు ఇచ్చి ఎపి గత నెల సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇది కూడా ఇప్పుడు సర్కార్ పై ఇప్పుడు వత్తిడి పెంచింది. టీకా ఉత్సవ్ లో ఉత్సహంగా తొలి టీకా వేయించుకున్న వారందరికీ రెండో డోస్ టైం వచ్చేసింది. దాంతో వారు వ్యాక్సిన్ లకోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. గత అనుభవాలను పురస్కరించుకుని రోజుకు పదిలక్షల వరకు వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంటే టీకా ప్రజలకు వేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కూడా సర్కార్ ప్రకటించడం అభినందనీయమే. అయితే తక్కువగా ఉత్పత్తి అయ్యి వస్తున్న టీకా లను తోపులాట లు లేకుండా పంపిణీ చేయడం ప్రాధాన్యత క్రమంలో అందించడం ఇప్పుడు ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. దీనికి గ్రామ వాలంటీర్ వ్యవస్థనే జగన్ వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఇంటికి టోకెన్ లు అందజేసి వారికి తేదీ, సమయం ఇస్తే వ్యాక్సిన్ కోటా ను బట్టి వారిని పిలిచి టీకాలు వేస్తే ప్రశాంతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే ఈ సూచనలను సర్కార్ ఏ మేరకు పరిగణలోనికి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. లేనిపక్షంలో టీకా కేంద్రాలు ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ లు గా మారే ప్రమాదం పొంచివుంది.

Tags:    

Similar News