ఓడిపోయినా పాలన చేయాలనేనా?

చట్ట సభల్లో ఎగువ సభ హుందాగా ఉండాల్సి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశం రాని మేధావి వర్గం ఈ సభలో ప్రాతినిధ్యం పొందినప్పుడు మాత్రమే [more]

Update: 2020-06-18 03:30 GMT

చట్ట సభల్లో ఎగువ సభ హుందాగా ఉండాల్సి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశం రాని మేధావి వర్గం ఈ సభలో ప్రాతినిధ్యం పొందినప్పుడు మాత్రమే అలాంటి హుందాతనం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, పోటీ చేయలేని వారికి పునరావాసం కల్పించేందుకు ఈ సభను వాడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాల విషయంలో ఎగువ సభ ప్రాముఖ్యం, ప్రాధాన్యత తక్కువ.

ప్రజలు పట్టం కట్టింది….

ప్రజలు ఎన్నుకుని పట్టం కట్టేది దిగువ సభ (అసెంబ్లీ) సభ్యులకే కాని ఎగువసభ (మండలి) సభ్యులకు కాదు. ఐదేళ్ళు పాలన చేయాల్సింది అసెంబ్లీ, కౌన్సిల్ కాదు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అరాచక పాలన చేసినా ప్రతిపక్షం కానీ, ఎగువసభ కానీ ఏమీ చేయలేవు. ప్రతిపక్షం నిరసన తెలియజేస్తూ ప్రజల్లోకి వెళుతుంది. ప్రజలు ఐదేళ్ళ తర్వాత తమ వంతు వచ్చినప్పుడు ఎవరికి పట్టం కట్టాలో తేల్చుకుంటారు.

సవరణలు మాత్రమే….

ఎగువ సభ కూడా ఇంచుమించు అంతే.. ప్రజలు పట్టం కట్టిన సభ తప్పుడు నిర్ణయాలు చేస్తే సవరణలు సూచించవచ్చు, లేదా వెనక్కి పంపవచ్చు. పాలన చేయవలసిందీ, ప్రజలకు బాధ్యత వహించవలసింది, గెలుపు, ఓటమి లెక్కలు చూసుకునేది దిగువ సభే (అసెంబ్లీ) కానీ ఎగువ సభ (మండలి కాదు . కానీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎగువ సభ ద్వారా రాష్ట్ర పాలనపై నిర్ణయాలు చేసి, దిగువ సభను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాజకీయ వేదికగా…..

“పెద్దలు” విజ్ఞత కోల్పోయి ఎగువసభను రాజకీయ వేదికగా మలుచుకుంటున్నారు. గతంలో ఇలాగే ప్రజాతీర్పును గౌరవించకుండా రాజకీయంగా ప్రవర్తించిన “పెద్దలు” ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు కూడా పెద్దలు రాజకీయమే చేస్తున్నారు. అసెంబ్లీలో ఆధిక్యత ఉన్న పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుంది, కౌన్సిల్ లో ఆధిక్యత ఉన్న పార్టీ కాదు. ఈ లాజిక్ మిస్సవుతోంది. సభ అభాసుపాలవుతోంది.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News