ఈ మంత్రిని ఎవ‌రో తొక్కేస్తున్నార‌ట‌.. అల‌కకు కార‌ణం ఇదేనా..?

పినిపే విశ్వరూప్‌. తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజ‌కీయాల్లో ఆయ‌నో సీనియ‌ర్‌. గ‌తంలో వైఎస్‌, రోశ‌య్య, కిర‌ణ్‌కుమార్ రెడ్డి కేబినెట్ లో [more]

Update: 2021-01-07 05:00 GMT

పినిపే విశ్వరూప్‌. తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజ‌కీయాల్లో ఆయ‌నో సీనియ‌ర్‌. గ‌తంలో వైఎస్‌, రోశ‌య్య, కిర‌ణ్‌కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ప‌నిచేశారు. ప్రస్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో గ్రామీణ నీటిపారుద‌ల, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్ లో ఉన్న ఎంతో మంది మంత్రుల కంటే ఆయ‌న సీనియ‌ర్‌. తూర్పు గోదావ‌రి జిల్లాలో మిగిలిన మంత్రులు క‌న్నబాబు, చెల్లుబోయిన వేణు కంటే ఆయ‌న చాలా చాలా అనుభ‌వం ఉన్న మంత్రి. అయితే ఆయ‌న కొన్నాళ్లుగా అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోను, ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని ఆయ‌న అనుచ‌రులే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదిన్నర కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాదిన్నర‌లో కూడా పినిపే విశ్వరూప్ ఆశించిన విధంగా ఎక్కడా దూకుడు చూపించ‌లేక పోయారు.

సొంత సామాజికవర్గానికి కూడా….

త‌న సొంత సామాజిక వ‌ర్గానికి కూడా పినిపే విశ్వరూప్ న్యాయం చేయ‌లేక‌పోవ‌డంతో పాటు ఇటు జిల్లాలో సీనియ‌ర్‌గా ఉండి కూడా త‌న ముద్ర వేయ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, అసెంబ్లీ స‌మావేశాలు ఉంటే రావ‌డం లేక‌పోతే.. కేబినెట్ భేటీ ఉంటే రావ‌డం.. ఆవెంట‌నే ఇంటికి వెళ్లడం.. ఇదీ ఆయ‌న చేస్తున్న ప‌ని! మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? అభివృద్ధి అంటే.. ఆయ‌న‌కు ఇష్టం లేదా? లేక‌.. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేక పోతున్నారా? లేక‌.. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మ‌రేదైనా స‌మ‌స్య వెంటాడుతున్నదా ? అంటే.. ఔన‌నే అంటున్నారు పినిపే విశ్వరూప్ అనుచ‌రులు.

ప్రకాశం నేత కీలకంగా….

పినిపే విశ్వరూప్ మంత్రిగా ఉన్నా.. జిల్లా ఇంచార్జ్ నాయ‌కుడిగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీల‌క నేత‌ ఇక్కడ చ‌క్రం తిప్పుతున్నారు. అన్నీ ఆయ‌న క‌నుస‌న్నల్లోనే జరుగుతున్నాయ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి అయినా కూడా స‌ద‌రు నేత‌కు అన్నీ చెప్పి చేయాల్సిందే. దీంతో పినిపే ఆయ‌న‌కు చెప్పడం ఇష్టం లేక‌. ఆదిలో కొన్ని ప‌నులు చేప‌ట్టారు. అయితే ఆయాప‌నులు మ‌ధ్యలోనే ఆగిపోయాయి. కాంట్రాక్టులు తీసుకున్నవారు కూడా మ‌ధ్యలోనే విడిచి పెట్టార‌ని స‌మాచారం. అంతేకాదు. స‌ద‌రు ఇంచార్జ్ నాకు తెలియ‌కుండా ప‌నులు ఎలా చేస్తార‌ని.. కాంట్రాక్టర్లను హెచ్చరించ‌డంతో మంత్రి పినిపే విశ్వరూప్ ఎటూ చెప్పలేక‌.. మౌనం పాటిస్తున్నారు. మంత్రిగా ఉన్నా.. నాకు ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని ఆయ‌న వాపోతున్న ప‌రిస్థితి ఉంద‌ట‌.

వైసీపీ నేతల నుంచే విమర్శలు…

నిన్న మొన్నటి వ‌ర‌కు పినిపే విశ్వరూప్ కోన‌సీమ‌లో మ‌రో రెండు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వేళ్లు పెట్టార‌ని అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల నుంచి విమ‌ర్శలు ఎదుర్కోగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం బోర్డర్ దాటే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ కోరితే. వెంట‌నే ప‌ద‌విని వ‌దుల‌కుని ఎమ్మెల్యేగా అయినా .. కొన‌సాగుతా కానీ.. ఇలా ఒక‌రి ఆదేశాల మేర‌కు నేను ప‌నిచేసేది లేద‌ని ఆయ‌న నిష్కర్షగానే స‌మాధానం చెబుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి మంత్రి ప‌ద‌వి రాలేద‌ని.. వ‌చ్చినా.. ఇలా ఉంటుంద‌ని తెలియక పినిపే విశ్వరూప్ అనుచ‌రులు నోరు వెళ్లబెడుతున్నారు.

Tags:    

Similar News