పెద్దారెడ్డి పట్టు సడలుతుందా?

తాడిపత్రి నియోజకవర్గంలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. అయితే మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరగవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఏ ఎన్నికలు లేని [more]

Update: 2021-01-20 03:30 GMT

తాడిపత్రి నియోజకవర్గంలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. అయితే మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరగవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఏ ఎన్నికలు లేని సయమంలోనే వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాడిపత్రిలో 144వ సెక్షన్ ను విధించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రెండు వర్గాలు….

ఈ ఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ సోదరులు సయితం ఒకరోజు దీక్షకు దిగారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్య పోరు మరింత పెరుగుతుందంటున్నారు. పెద్దారెడ్డి కూడా ఇటువంటి పరిస్థితుల్లో తన పట్టును నిలుపుకోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దారెడ్డి ఏమాత్రం వెనకబడినా ఆయనకు జేసీ బ్రదర్స్ నుంచి మరింత ప్రతిఘటన ఎదురవుతుంది.

ఎన్నికలు జరిగితే…?

అందుకే పెద్దారెడ్డి ఇప్పుడు పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి పెట్టారంటున్నారు. నిజానికి తాడిపత్రి జేసీ కుటుంబానికి కంచుకోట. కొన్నేళ్లుగా ఆ కుటుంబం తప్పించి మరొకరు గెలిచింది లేదు. అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్దారెడ్డి ఆ కోటను బద్దలు కొట్టగలిగారు. జేసీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత, పెద్దారెడ్డిపై సానుభూతి, జగన్ ప్రభంజనం వెరసి ఆయన గెలుపుకు కారణాలని చెప్పుకోవాలి. అయితే క్రమంగా జేసీ కుటుంబం మళ్లీ పట్టుపెంచుకునే ప్రయత్నంలో ఉంది.

జేసీ బ్రదర్స్ సై…..

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మద్దతుదారులే గెలుపొందాలని పెద్దారెడ్డి పట్టుదలతో ఉన్నారు. తమ అభ్యర్థులు కూడా బరిలో ఉంటారని జేసీ బ్రదర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ మధ్య మళ్లీ వార్ మొదలయిందనే చెప్పాలి. దీంతో పోలీసులు కూడా నిఘాను పెంచారు. మొత్తం మీద తాడిపత్రిలో పెద్దారెడ్డి పట్టు ఏంటో ఈ ఎన్నికలోలో తేలుతుందంటున్నారు జేసీ బ్రదర్స్. బలం ఏంటో చూపిస్తానని పెద్దారెడ్డి సవాల్ విసురుతున్నారు.

Tags:    

Similar News