వైసీపీలో మహిళా నేత మహా రాజకీయం…?

రాజకీయాలు అన్నవే ఒక వింత క్రీడ. ఇక్కడ ఎవరికి తోచినట్లుగా వారు గేమ్ ఆడుకోవచ్చు. అంతిమంగా అధినాయకత్వాన్ని మెప్పించి తాము కోరుకున్న పదవులు పొందడమే అజెండా. ఈ [more]

Update: 2021-09-10 14:30 GMT

రాజకీయాలు అన్నవే ఒక వింత క్రీడ. ఇక్కడ ఎవరికి తోచినట్లుగా వారు గేమ్ ఆడుకోవచ్చు. అంతిమంగా అధినాయకత్వాన్ని మెప్పించి తాము కోరుకున్న పదవులు పొందడమే అజెండా. ఈ విషయంలో విశాఖకు చెందిన ఆ మహిళా నేత నాలుగాకులు ఎక్కువే చదివారు. ఆమె పేరు పేడాడ రమణి కుమారి. ఆమె రాజ‌కీయ అరంగ్రేట్రం ప్రజా రాజ్యం పార్టీ నుంచి జరిగింది. ఇప్పటికి దశాబ్ద కాలం పైగా ఆమె రాజకీయాలలో ఉన్నారు. ఆమె తరువాత కాంగ్రెస్ లో చేరారు. అక్కడ అంచెలంచెలుగా ఎదిగి ఏపీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఇక విశాఖ ఎంపీ సీటుకు ఆమె 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధినిగా పోటీ చేశారు.

ఆశలు ఉన్నాయి …

రమణి కుమారి ఈ మధ్యనే వైసీపీలో చేరారు. విశాఖ కాంగ్రెస్ లో ఆ మాత్రం పెద్ద తలకాయ ఆమె మాత్రమే. అటువంటి పేడాడ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమెను సాదరంగా విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఆమెకు గట్టి భరోసాయే ఇచ్చారు అని అంటున్నారు కానీ తాజాగా జరిగిన నామినేటెడ్ పదవులు పంపిణీలో రమణి కుమారికి ఎటువంటి అవకాశం దక్కలేదు. ఆమె పార్టీలో కొత్తగా చేరిన నాయకురాలు కావడంతో కొన్నాళ్ళు వేచి ఉండమని హై కమాండ్ చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే పేడాడ నామినేటెడ్ పదవులతో కాదు, పెద్ద ఆశలే పెట్టుకుని వైసీపీలో చేరారని అంటున్నారు.

టికెట్ దక్కేనా ?

విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి రమణి కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె నివాసం, స్థాన బలం అన్నీ అక్కడే గట్టిగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేడాడ రమణి కుమారి బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడంతో రాజకీయంగా అది తనకు ప్లస్ పాయింటు అవుతుందని భావిస్తున్నారు. ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ కి టికెట్ ఇచ్చింది. ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను మారుస్తారు అన్న ప్రచారం సాగుతోంది. దాంతో రమణి కుమారికి టికెట్ దక్కుతుంది అన్న మాట అయితే పార్టీలో వినిపిస్తోంది.

నేతలందరితోనూ…?

ఇదిలా ఉంటే పేడాడ రమణి కుమారి వైసీపీలో కొత్తగా చేరినా నేతలందరితోనూ కలసిపోతున్నారు. ఎవరికి ఏ చిన్న పదవి వచ్చినా వారింటికి తానే స్వయంగా వెళ్ళి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించి వస్తున్నారు. విశాఖ లోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నుంచి అందరు ఎమ్మెల్యేలు, కీలక నాయకులను స్వయంగా కలసి పేడాడ రమణి కుమారి వారి వద్ద నుంచి మంచి మార్కులు కొట్టేశారు. రేపటి రోజున పార్టీ తనకు ఏదైనా చాన్స్ ఇచ్చినా ఎవరి నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. మొత్తానికి పేడాడ వైసీపీలో దూసుకుపోతున్న తీరు. ఆమె రాజకీయం చూసి పార్టీలోనే చర్చ నడుస్తోంది. విశాఖ రాజకీయాలలో మహిళా నాయకురాళ్ళ కొరత అయితే ఉంది. దాన్ని పేడాడ రమణి కుమారి పూర్తి చేస్తున్నారు. మరి జగనన్న, సాయన్న దీవెనలు ఉంటే తప్పకుండా పేడాడ రమణి కుమారి పెద్ద పదవులనే చూస్తారు అంటున్నారు.

Tags:    

Similar News