అయ్యో పాపం.. పవన్ కళ్యాణ్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయతెరపై మెగా ఫ్యామిలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఓ పార్ట్ టైమ్ జాబ్ గానే చూస్తారు. 2009 ఎన్నికల్లో తన సోదరుడు [more]

Update: 2019-05-24 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయతెరపై మెగా ఫ్యామిలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఓ పార్ట్ టైమ్ జాబ్ గానే చూస్తారు. 2009 ఎన్నికల్లో తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం కావడంతో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ సైతం సైలెంట్ అయిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు ప్రజల్లోకి రాని పవన్ సినిమాలతో బిజీ అయ్యారు. తర్వాత 2014 ఎన్నికల్లో అనూహ్యంగా మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు.

కింగ్ మేకర్ అవుతారనుకుంటే…

అయితే, అప్పుడు పోటీ చేయకుండా టీడీపీని గెలిపించాలని ఊరూరూ తిరిగి ప్రచారం చేశారు. టీడీపీతో పనిచేయించే బాధ్యత తనది అన్నట్లుగా ప్రజలకు హామీ ఇచ్చారు. తర్వాత నాలుగేళ్ల పాటు ఆయన మళ్లీ ప్రజలకు దూరంగా ఉన్నారు. నాలుగేళ్లలో ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఉద్దానం కిడ్ని సమస్య, రాజధాని భూములపై రెండుమూడుసార్లు ఏవో కార్యక్రమాలు చేశారు. ఇక, ఎన్నికలకు ఆరు నెలలుగా ఉందనగా పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. ఎన్నికల్లో ఆయన చంద్రబాబు, జగన్ అంత కష్టపడకపోయినా ప్రచారం బాగానే చేశారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. తాను స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కచ్చితంగా కింగ్ కాకున్నా కింగ్ మేకర్ అవుతానని, రాష్ట్రంలో హంగ్ వస్తే తానే కీలకమని పవన్ ధీమాగా ఉన్నారు. ఓ దశలో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నానని ఆయన ధీమాగా చెప్పారు.

ఓటమి అందుకేనా..?

అయితే, ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆశలు అడియాసలయ్యాయి. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. తమకు పట్టుంది అనుకున్న ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఆ పార్టీ చతికిలపడింది. దీంతో జనసేన శ్రేణులు ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇంత దారుణంగా ఓటమి పాలుకావడానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో లేకుండా పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండటం, ఆయనను ప్రత్యామ్నాయంగా ప్రజలకు చూడకపోవడం, తెలుగుదేశం పార్టీతో ఆయనకు అవగాహన ఉందనే వాదన ప్రజల్లో ఉండటమే జనసేన ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతాడని, తమ నాయకుడే వంద మందితో సమానమని జనసేన పార్టీ శ్రేణులు ఆశించినా వారి ఆశలు అడియాసలయ్యాయి. ఇంత ఘోర ఓటమి తర్వాత జనసేన భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News