ఎరక్క పోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను

బీజేపీ జాతీయ పార్టీ. అలాగని అంతటా అదే విధానం కొనసాగించదు. తనకు నచ్చిన చోటున నచ్చిన తీరుగా ఉంటుంది. ఏపీకి వచ్చి ఒక పాట పాడితే తెలంగాణకు [more]

Update: 2020-11-05 12:30 GMT

బీజేపీ జాతీయ పార్టీ. అలాగని అంతటా అదే విధానం కొనసాగించదు. తనకు నచ్చిన చోటున నచ్చిన తీరుగా ఉంటుంది. ఏపీకి వచ్చి ఒక పాట పాడితే తెలంగాణకు వెళ్లి మరో రాగం అందుకుంటుంది. దానికి అచ్చమైన ఉదాహరణ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం విషయంలో చేసిన యాగీయే. రెండు తెలుగు రాష్ట్రాలు కావాలనుకునే ఒక జాతీయ పార్టీ అనుసరించిన విధానం అది కాదు అని అంతా విమర్శించారు కూడా. ఇపుడు తెలంగాణాలో కేసీయార్ ని ఫుల్ టార్గెట్ చేస్తూ మిత్రపక్షం జనసేనకు దడ పుట్టిస్తున్న బీజేపీ ఏపీలో పోలవరం పేరిట కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. దీంతో కమలంతో కలసి నడవడం కష్టమేనా అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది.

కేసీయార్ తో ఢీ …

తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక వేళ బీజేపీ బాగానే రచ్చ చేసింది. ఏకంగా కేసీయార్ సర్కార్ మీదనే బాణాలు వదిలింది. గులాబీ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. దానీ ప్రతిగా బండి సంజయ్ ని అధికార పార్టీ అరెస్ట్ చేయించింది. దాంతో రెండు పార్టీల మధ్యన గొడవ ముదిరి పాకాన పడింది. ఈ సమయంలో మిత్రపక్షం బీజేపీ కొమ్ము కాయలేక, అలాగని డైరెక్ట్ గా కేసీయార్ కి చెడ్డ అవలేక జనసేనాని ఒక మొక్కుబడి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మమ అనిపించారు. అందులో ఎక్కడా టీయారెస్ ప్రభుత్వం మీద నేరుగా ఒక్క విమర్శ లేకుండా జాగ్రత్తపడ్డాడు.

వీరంగంతో ఇరకాటమే ….

సరే అప్పటికి ఆ గండం గడచినా రానున్న రోజుల్లో బీజేపీ టీయారెస్ మీద సై అంటూ దూసుకువస్తే జనసేన కలసి పోరాటం చేయకతప్పదు. దగ్గరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో పవన్ కి అది ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే పవన్ రాజకీయ కార్యక్షేత్రం పూర్తిగా ఏపీనే. కేసీయార్ తో గొడవలు ఎందుకు అన్నది ఆయన రాజకీయ విధానంగా ఉందంటున్నారు. పైగా మెగా కుటుంబంతో కేసీయార్ కుటుంబం సాన్నిహిత్యం కూడా బాగా ఉంది. ఇపుడు రొచ్చు రాజకీయం పుణ్యమాని దాన్ని చెడగొట్టుకోవడానికి పవన్ ఎటూ సిధ్ధంగా లేరని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ ఏమీ లేదు. జనసేనకు అసలు ఆశలు లేవు. కానీ కాషాయ దళం ఇలాగే వీరంగం వేస్తే మాత్రం పవన్ కల్యాణ్ ఇరుక్కుపోకతప్పదు అంటున్నారు.

వరమే శాపంగా…..

ఇక ఏపీలో చూసుకున్నా బీజేపీ తీరు జనసేనకు ఏమీ బాగులేదు అంటున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమను కనీసం ఏ విషయంలోనూ సంప్రదించడంలేదన్న అసంతృప్తి పవన్ కల్యాణ్ కి ఉంది. దానికి తోడు ఏపీకి ప్రత్యేక హోదాని బీజేపీ ఎగ్గొట్టింది. దాన్ని చాలా తెలివిగా జనంలోనే హోదాపైన పోరాట పటిమ లేదని నెట్టేసి పవన్ కల్యాణ్ తప్పించుకున్నారు కానీ ఇపుడు పోలవరానికే కాషాయం పార్టీ ఎగనామ పెట్టేసింది. దీంతో ఆ పార్టీతో దోస్తీ కట్టిన పాపానికి పవన్ కల్యాణ్ కూడా నిందను మోయాల్సివుంటుంది. పోలవరానికి భారీ కోత విధించడం ద్వారా ఏపీ మీద తమకు ఏ రాజకీయ ఆశలూ లేవని బీజేపీ చెప్పేసుకుందని అంటున్నారు. దీంతో అన్ని వర్గాలు బీజేపీ మీద పీక బండెడు కోపంతో రగిలిపోతున్నాయి. అలాటపుడు ఆ పార్టీతో కలసి వచ్చే ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకుందామని చూస్తున్న పవన్ కల్యాణ్ కి ఇది అతి పెద్ద ఇబ్బందిగానే చూడాలి. మరి బీజేపీతో దోస్తీని కటీఫ్ చేసుకుని బయటకు వస్తారో లేక ఇంకా కొన్నాళ్ళు వేచి చూస్తారో పవనే నిర్ణయించుకోవాలి మరి.

Tags:    

Similar News