ఇక ఎవరంటారు..నన్ను…?

పవన్ కల్యాణ్ ను సీజనల్ పొలిటీషియన్ అని అన్నారు. పార్ట్ టైం పొలీటిషయన్ అని కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ను అలా పిలిచేందుకు [more]

Update: 2019-11-07 06:30 GMT

పవన్ కల్యాణ్ ను సీజనల్ పొలిటీషియన్ అని అన్నారు. పార్ట్ టైం పొలీటిషయన్ అని కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ను అలా పిలిచేందుకు అవకాశం ఉండకపోవచ్చు. అందుకు కారణం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయమే. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండటం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తన లక్ష్యంగా పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నారు.

ఒక్క సీటు గెలుచుకున్నా….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. బీఎస్పీ, వామపక్షాలతో కలసి పోటీ చేసినా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. పవన్ కల్యాణ్ తాను స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో సయితం ఓడిపోవడంతో జనసేన పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయం చేయలేరన్న వాదనలు కూడా పార్టీలో ఉన్నాయి.

టీడీపీ తేరుకుని….

దారుణంగా ఓటమిపాలయిన తెలుగుదేశం పార్టీ నెలరోజుల్లోనే తేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజాసమస్యలపై ఆందోళనలకు దిగుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కూడా ఇటీవల బలోపేతం చేశారు. ప్రజల్లో తనపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

లాంగ్ మార్చ్ సక్సెస్ తో….

అందుకే ఇసుక కొరతకు నిరసనగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ ఊహించినదానికన్నా సభ సక్సెస్ కావడంతో ఇకపై ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ టార్గెట్ 2024 అని గతంలోనే ప్రకటించారు. ఆ దిశగానే మరో నాలుగున్నరేళ్లు పార్టీని కాపాడుకుని ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారని జనసేన వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద తాను రెండుచోట్ల ఓటమి చెందిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఫైర్ పెరిగిందంటున్నారు. పోరాటాల ద్వారానే ప్రజల్లో ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారట.

Tags:    

Similar News