పవన్ వరసగా ఇదేంటి.. వాటెబవుట్ జనసేన ?

ఇక ముఖానికి రంగు వేసుకునేది లేదు, నేను కోట్ల రూపాయల పారితోషికం వదులుకుని వచ్చాను. హీరోగా డిమాండ్ ఉన్న టైంలోనే నేను ప్రజల కోసం వచ్చాను, ఎన్టీయార్ [more]

Update: 2020-09-02 11:00 GMT

ఇక ముఖానికి రంగు వేసుకునేది లేదు, నేను కోట్ల రూపాయల పారితోషికం వదులుకుని వచ్చాను. హీరోగా డిమాండ్ ఉన్న టైంలోనే నేను ప్రజల కోసం వచ్చాను, ఎన్టీయార్ లా అన్ని బాధ్యత‌లు తీరిపోయి పండు వయసులో రాలేదు…ఇలా పవన్ కల్యాణ్ ఎన్నికల ముందర ప్రతీ సభలో చెప్పుకుంటూ వచ్చారు. అంటే దాని తాత్పర్యం ఏంటి. తాను త్యాగపురుషుడిని, కోట్ల సంపాదన వదిలేశాను, మీ కోసం వచ్చాను కాబట్టి మీరు గెలిపించి నాకు అధికారం ఇవ్వాలని అని ఎమోషనల్ అప్పీల్ అన్నమాట. సరే అది వర్కౌట్ కాలేదు. ఎంతలా అంటే పవనే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినంతగా. దాంతో పవన్ కల్యాణ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మళ్ళీ మేకప్ వేశారు ఈసారి చెప్పిందేంటి అంటే తనకు వేరే ఆదాయం లేదు, డైరీలు, సిమెంట్ కంపెనీలు లేవు అంటూ చంద్రబాబు, జగన్ ఆదాయ మార్గాలు చూపించి తాను సినిమాల్లో వేస్తే తప్పేంటని లాజిక్ గా మాట్లాడారు.

అదే లోకమా…?

సరే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఒక సినిమా చేస్తాడు అని ఎవరూ అనుకోలేదు కానీ వరసబెట్టి మరీ కాల్షీట్లు ఇస్తారని మాత్రం ఊహించలేదు, ఎవరేమనుకున్నా జనసైనికులు అసలు అనుకోలేదు. అయితే మేధావిగా పేరున్న జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ముందే ఊహించారు. అందుకే పవన్ కల్యాణ్ కి పాలిటిక్స్ మీద సీరియస్ నెస్ లేదంటూ గుడ్ బై కొట్టేశారు. ఇక నాడు ఆయనది తప్పు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన జనసైనికులు ఇపుడు పవన్ కల్యాణ్ తీరు చూసి షాక్ తింటున్నారు. ఇప్పటికి పవన్ కమిట్ అయిన సినిమాలు నాలుగట. తొలి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ మరో మూడు లైన్లో పెట్టేశారన్నమాట.

ఎప్పటికయ్యేనూ …?

ఈ సినిమాలోకమే ఓ ఆకర్షణ. ఇక్కడ హిట్లు వస్తే రెండు సినిమాలు తీస్తారు ఫ్లాప్స్ వస్తే కసి మీద మళ్ళీ మళ్లీ తీస్తారు. ఓ విధంగా పేకాట జూదం లాంటిదన్న మాట. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తొంబై శాతం పూర్తి అయింది. ఇంకా పది శాతం షూటింగ్ ఉండగానే కరోనా వెచ్చేసింది. ఇపుడు వ్యాక్సిన్ వస్తే కానీ షూటింగునకు రాను అని పవన్ కల్యాణ్ అంటున్నారుట. అంటే అన్నీ అయి ఆ సినిమా వచ్చేసరికి 2021 అవుతుంది. ఇక ఆ తరువాత క్రిష్ సినిమా ఒకటి కమిట్ అయ్యారు. అలాగే గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో మరో సినిమా ఉంది. ఈలోగా నాలుగవ సినిమా అంటూ మరోటి ముందుకు వచ్చింది. ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం పడుతుందోనన్నదే జనసైనికుల బాధగా ఉందిట.

భారం వాళ్లపైనా…..

ఏపీలో బీజేపీతో పొత్తు ఉంది. దాంతో సభలు సమావేశాల‌ గొడవ వాళ్ళు పడతారు. పొత్తు కాబట్టి వాళ్లు పెట్టిన వేదికలు ఎక్కి పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. ఇలా మొత్తం భారమంతా బీజేపీ మోస్తే పవన్ మళ్ళీ పార్ట్ టైం పాలిటిక్స్ మొదలుపెడతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక పవన్ సినిమాల్లో మునిగితే జనసేన కార్యకలాపాలు సాగేదెలా అన్న బాధ కార్యకర్తల్లో ఉంది. బీజేపీని చూసి కాడె వదిలెస్తే చివరాఖరుకు దొరికిపోయేది తమ పార్టీయేనని సైనికులు అంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ ఏమీ కాదు, వారు పవన్ కల్యాణ్ మీద ఆధారపడ్డారు. పవన్ కూడా వాళ్ళతో దోస్తీ కలిపారు. చూస్తూండగానే రెండవ ఏడాది మొదలైంది. కరోనా ముగిసి అంతా గాడిన పడితే గట్టిగా ఉండేది మూడేళ్ళే. దాంతో ఇప్పటి నుంచే సర్దుకోకపోతే ఈ కూటమి ఏపీలో గట్టిగా తొడగొట్టే సీన్ ఉంటుందా అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. వైసీపీ ఏపీలో బలంగా ఉండడమే కాదు, 2024 నాటికి కూడా రెడీ అవుతోంది, మరో వైపు టీడీపీకి బాబు ఎటూ అండగా ఉన్నారు. ఈ రెండు పార్టీలను తట్టుకుని ముందుకు దూసుకురావాలంటే ఇప్పటినుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిందే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వరస సినిమాలకు కాల్షీట్లు పంచేశారు. మరి జనసేనాని పొలిటికల్ కాల్షీట్లు ఇస్తారా. చూడాలి

Tags:    

Similar News