ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారా?

పవన్ కళ్యాణ్ ఇపుడు రెండు పడవల్లో కాళ్ళు వేశారు. ఓ వైపు సినిమాలు చేసుకుంటూ ట్విట్టర్ ద్వారా డైలీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది నిజంగా పవన్ ఛాయిస్. [more]

Update: 2020-04-26 14:30 GMT

పవన్ కళ్యాణ్ ఇపుడు రెండు పడవల్లో కాళ్ళు వేశారు. ఓ వైపు సినిమాలు చేసుకుంటూ ట్విట్టర్ ద్వారా డైలీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది నిజంగా పవన్ ఛాయిస్. ఆయన ఇష్టం. ఇక ఆయన సినిమా వకీల్ సాబ్ కరోనా వల్ల ఆగిపోయింది. దాంతో పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాల మీదనే దృష్టి పెట్టారు. అయితే ఆయన ఒక మాట చెప్పారు. ఇపుడు కరోనా వైరస్ ఉంది. ఇటువంటి వేళ ఎవరూ రాజకీయాలు చేయకూడదు. అందరి దృష్టి కూడా కరోనా కట్టడి మీదనే ఉండాలి. రాజకీయాల్లో జూనియర్ అయినా పవన్ కల్యాణ్ మంచి మాట చెప్పారు, భేష్ అనుకున్నారంతా. కానీ పవన్ కల్యాణ్ ఒట్టు తీసి గట్టు మీద పెట్టారా అనిపిస్తోందిపుడు.

బురద జల్లుడే …..

నిజానికి పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చేసింది ఇంతవరకూ వలస‌ కార్మికుల కష్టాల గురించి తెలియచేయడం, వారిని ఆదుకోవాలని పాలకులను కోరడం. అయితే అదే సమయంలో టీడీపీ, బీజేపీ, సీపీఐ వంటి పార్టీలు తమదైన‌రాజకీయాలు చేస్తునే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ప్రతీ రోజూ జగన్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. దానికి సీపీఐ రామక్రిష్ణ, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు జత కలుస్తున్నారు. మరి ఇది బురద జల్లుడు రాజకీయం కాదన్ పవన్ కల్యాణ్ అనగలరా అంటున్నారు తటస్థులు, మేధావులు.

అవసరమా…?

ఇపుడు ఆపదకాలంలో ఉన్నాం. ఓవైపు కరోనా పరీక్షలు సరిగ్గా సాగడంలేదని ఇవే ప్రతిపక్షాలు అంటున్నాయి. దాని కోసం దక్షిణ కొరియా నుంచి వైసీపీ సర్కార్ రాపిడ్ కిట్స్ తెచ్చిపెట్టింది.సరే ధరలు ఎలా ఉన్నాయో ఏమో, అందులో అవినీతి ఉందా లేదా అన్నది పక్కన పెట్టి ముందు కరోనా బాధితుల విషయలో యాక్షన్ కి ప్రభుత్వం దిగుతూంటే గమ్మునుండాల్సిన ప్రతిపక్షాలు కిట్స్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విరుచుకుపడడం తగునా అన్నది పవన్ కల్యాణ్ లంటి వారు ఆలోచిస్తున్నారా అని వైసీపీ నేతలు అంటున్నారు. కన్నా ఒకటి అని నాలుగు అనిపించుకుంటూంటే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి చిల్లర రాజకీయాలకు ఇది సమయం కాదని వైసీపీకి సుద్దులు చెప్పడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.

దిగిపోయినట్లే ….

ఈ వేళ రాజకీయాలు వద్దు అని చెబుతున్న పవన్ కల్యాణ్ కన్నాకు మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా రంగంలోకి దిగిపోయానని చెప్పేశారు. ఓ విధంగా పవన్ కల్యాణ్ కి తపోభంగం కలిగిందేమో. ఆయన నిష్టగా ఉండాలనుకున్నారు కానీ ఏపీ రాజకీయాలు ఉండనివ్వలేదేమో. మరి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అసలు రాజకీయం లేకుండా మీడియా మీటింగులు పెట్టడం లేదు. ఇంకో వైపు కన్నా అగ్గి రాజేశారు. ఈ నేపధ్యంలో తాను కూడా పోటీలో లేకుంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ మీద విమర్శలకు దిగుతున్నారు. అంతే కాదు, వైసీపీ నేతల మీద ప్రజలు తిరగ‌బడతారంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం కూడా దారుణమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఏమీ న్యూట్రల్ గా లేరని, విప‌క్షమే తన పక్షమని చెప్పేసుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News