పులిని చూసి నక్క…?

జనంలోకి వెళ్లినంత మాత్రాన సీఎం అయ్యేటట్లేయితే రాజకీయనేతలందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఐదేళ్ల పాటు ప్రజలతోనే మమేకమై తాము అనుకున్నది సాధిస్తారు. జనంలో ఉంటం వేరు. నమ్మకం [more]

Update: 2019-12-03 13:30 GMT

జనంలోకి వెళ్లినంత మాత్రాన సీఎం అయ్యేటట్లేయితే రాజకీయనేతలందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఐదేళ్ల పాటు ప్రజలతోనే మమేకమై తాము అనుకున్నది సాధిస్తారు. జనంలో ఉంటం వేరు. నమ్మకం కలిగించడం వేరు. ఈ వ్యత్యాసాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రహించాల్సి ఉంటుంది. ఇటీవల పవన్ కల్యాణ్ జగన్ మొండిగా తిరిగి సిఎం అయినప్పుడు ప్రజా సమస్యలపై తాను తిరిగి ఎందుకు సీఎం కాలేనని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. బహుశ పవన్ కల్యాణ‌్ గత తొమ్మిదేళ్ల నుంచి జగన్ ప్రజల్లో ఉండటం వల్లనే సీఎం అయ్యారని అనుకుని ఉండవచ్చు.

జనాల్లో ఉంటేనే…..

జగన్ లాగానే తాను ప్రజల్లో ఉంటే ముఖ్యమంత్రిని అయిపోతానని పవన్ కల్యాణ్ భావించి ఉండవచ్చు. ఇందులో అనేక విషయాలు పవన్ కల్యాణ్ గ్రహించాల్సి ఉంటుంది. జగన్ మొండితనం అన్నది కరెక్టే. తొమ్మిదేళ్ల నుంచి జగన్ ప్రజల్లో ఉండటమూ నిజమే. కానీ ఒక పార్టీని నడపాలంటే నిత్యం ప్రజల్లోనే ఉంటేనే సరిపోదు. నాయకుల్లో, క్యాడర్ లోనూ ముఖ్యంగా ప్రజల్లో నమ్మకం కలిగించాలి. జగన్ ఆ పనిని పార్టీని పెట్టిన తొలి మూడేళ్లలోనే చేయగలిగారు. అంతేకాదు జగన్ ఎవరిపైనా ఆధారపడ లేదు. ఒంటరిగానే పోరాడిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలి. అంతే కాదు జగన్ కు సీఎం పదవి ఆషామాషీగా రాలేదు. ఎన్ని హర్డిల్స్. ఎన్ని అవమానాాలు. ఎన్ని ఆటుపోట్లు. ఇవన్నీ తట్టుకుని జగన్ నిలబడగలిగారు కాబట్టే ముఖ్యమంత్రి పీఠం వరించింది.

రావడమే రాంగ్ రూట్లో….

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడమే రాంగ్ రూట్లో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజికవర్గాన్ని తొలుత పవన్ కల్యాణ్ ఆకట్టుకోలేకపోయారు. సోదరుడు చిరంజీవికి లభించిన ఆదరణ కూడా కాపుల్లో పవన్ కల్యాణ్ కు లభించలేదనే చెప్పాలి. అంతేకాదు పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన తర్వాత అనేక తప్పటడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీలకు బహిరంగ మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచే జగన్ సీఎం కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి దిగినట్లు కన్పించింది.

నమ్మకమే ముఖ్యం…..

ఇక జగన్ ఎప్పుడూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. తనకు ఆహ్వానాలు అందినా సున్నితంగా తిరస్కరించారు తప్ప కౌగిలింతలకు సిద్ధపడలేదు. కానీ పవన్ కల్యాణ్ ఎవరిని తిడతారో? ఎవరిని పొగుడుతారో? తెలియదు. బీజేపీ, టీడీపీలను 2014 ఎన్నికల్లో పొగిడారు. 2019 ఎన్నికల్లో ఇద్దరినీ దారుణంగా దూషించారు. దీంతో ఒక స్టాండ్ అంటూ పవన్ కల్యాణ్ కు లేకపోయిందని ప్రజలకు అర్థమయిపోయింది. అందుకే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా గెలవలేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా పవన్ కల్యాణ‌్ వ్యాఖ్యలు ఉన్నాయని ఇట్టే అర్థమవుతుంది. ప్రజల్లో నాయకుడు తిరగాల్సిందే. ఆ మేరకు తన నాయకత్వంపై నమ్మకం కల్గించినప్పుడే పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రజలు సీఎంగా అంగీకరిస్తారన్న నిజాన్ని గుర్తెరగాలి.

Tags:    

Similar News