పవన్.. అక్కడి నుంచే ఎందుకు..?

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న స్థానాలపై ఓ క్లారిటీ వచ్చింది. అనేక ప్రచారాలు, ప్రకటనల తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, [more]

Update: 2019-03-20 02:30 GMT

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న స్థానాలపై ఓ క్లారిటీ వచ్చింది. అనేక ప్రచారాలు, ప్రకటనల తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుటు చిరంజీవి తన స్వస్థలమైన పాలకొల్లుతో పాటు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేశారు. పాలకొల్లులో ఐదు వేల తేడా ఓటమిపాలైన చిరంజీవి తిరుపతిలో మాత్రం 16 వేల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన స్వంత జిల్లాలోని భీమవరంతో పాటు బయటి జిల్లా నుంచి ఒక స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జనసేన పార్టీ అంచనా వేసింది.

భీమవరంలో త్రిముఖ పోటీ

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పెద్ద పట్టణమైన భీమవరంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన పులపర్తి రామాంజనేయులు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై 13 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాపులతో పాటు రాజులు గెలుపోటములను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ రెండు స్థానంలో నిలిచింది. పీఆర్పీ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణరాజు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రామాంజనేయులు చేతిలో ఓపోయారు. ఈసారి మళ్లీ ఇక్కడి నుంచి టీడీపీ తరపున రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. కాపు సామాజకవర్గానికే చెందిన ఆయన ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించిన వారవుతారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి బరిలో ఉండనున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండనుంది. పవన్ కళ్యాణ్ కు స్వంత సామాజకవర్గం అభ్యర్థి నుంచే పోటీ ఉండటంతో కాపు ఓట్లు కొంత మేర చీలే అవకాశం ఉంది.

ప్రజారాజ్యం గెలిచిన నియోజకవర్గం…

విశాఖపట్నం జిల్లాలోని గాజువాక స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత జనసేన పార్టీ బలంగా ఉన్న జిల్లా విశాఖపట్నం. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్వంత కాపు సామాజకవర్గం ఓటర్లు అధికారం. 2009లోనూ ప్రజారాజ్యం ఇక్కడ సత్తా చాటింది. ప్రజారాజ్యం తరపున ఆ ఎన్నికల్లో చింతలపూడి వెంకటరామయ్య విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ గెలుపొందారు. మళ్లీ ఆయనే పోటీ చేయనున్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తారు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. కార్పొరేటర్ గా పనిచేసిన ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపుతో పాటు రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. గాజువాకలో త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎక్కువగా కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. మొత్తానికి గాజువాకలో కూడా త్రిముఖ పోటీ తీవ్రంగా ఉండనుంది.

Tags:    

Similar News