గౌరు దంపతులు రిస్క్ తీసుకున్నారా..?

ఎన్నికల వేళ టిక్కెట్ల కోసం నేతలు రాజకీయ సిద్ధాంతాలు, వైరాలను మరిచి పార్టీలు మారుతున్నారు. టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా కొత్త పార్టీల్లోకి వెళుతున్నారు. ఇందుకు కర్నూలు జిల్లా [more]

Update: 2019-03-15 06:30 GMT

ఎన్నికల వేళ టిక్కెట్ల కోసం నేతలు రాజకీయ సిద్ధాంతాలు, వైరాలను మరిచి పార్టీలు మారుతున్నారు. టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా కొత్త పార్టీల్లోకి వెళుతున్నారు. ఇందుకు కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వెంకట్ రెడ్డి దంపతులు ఒక ఉదాహరణ. మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గౌరు దంపతులు ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పాణ్యం వైసీపీ టిక్కెట్ ను కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇస్తున్నారనే ఉద్దేశ్యంతోనే వారు టీడీపీలో టిక్కెట్ హామీ తెచ్చుకొని ఆ పార్టీలో చేరారు. అయితే, తమకు ఎంతో మేలు చేసిన వైఎస్ కుటుంబాన్ని వీడి టీడీపీలో చేరడం పట్ల వైసీపీ క్యాంపు నుంచి అనేక విమర్శలు వచ్చాయి. విమర్శలను పట్టించుకోని గౌరు దంపతులు పాణ్యం నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. టిక్కెట్ వీరికే ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పేయడంతో వారు ఓట్ల వేటలో పడ్డారు.

బలమైన నేతగా ఉన్న కాటసాని

ఈ ఎన్నికల్లో ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయిస్తున్న జగన్ సర్వేలను బాగా నమ్ముతున్నారు. ఆశావహులపై సర్వేలు, నియోజకవర్గంలో వారి బలాబలాలు, సామాజకవర్గ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని టిక్కెట్లు ఇస్తున్నారు. పాణ్యంలో గౌరు చరిత కంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అయితేనే గెలుపు అవకాశాలు ఎక్కువ అని గుర్తించిన జగన్ ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో గౌరు చరిత, కాటసాని రాంభూపాల్ రెడ్డి మధ్య పాణ్యం పోటీ హోరాహోరీగా ఉండనుంది. కాటసాని రాంభూపాల్ రెడ్డికి పాణ్యం నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయన ఇక్కడి నుంచి ఏకంగా ఏడుసార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉంటున్న ఆయన విభజన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏకంగా 60 వేల ఓట్లు సంపాదించి ఓడిపోయినా తన బలాన్ని చాటుకున్నారు.

పాత క్యాడర్ మద్దతు ఉంటుందా..?

ప్రజల్లో మంచి గుర్తింపు, గ్రామగ్రామాన బలమైన అనుచరవర్గం ఉండటంతో ఆయన బలమైన పోటీ ఇవ్వనున్నారు. అయితే, ఇంతకాలం పార్టీలో ఉన్న గౌరు వర్గం నేతలు దాదాపుగా అందరూ పార్టీని వీడటం పార్టీకి కొంత మైనస్ గా మారనుంది. ఇక, టీడీపీ నుంచి పోటీలో ఉన్న గౌరు చరితకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదనే సానుభూతి కొంత ఉంది. నియోజకవర్గంలో వీరికి కూడా బలమైన అనుచరవర్గం ఉండటం, టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కలిసివచ్చే అవకావం ఉంది. అయితే, పాణ్యంలో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో పాటు పాత టీడీపీ క్యాడర్ చాలావరకు గౌరు చరితకు టిక్కెట్ ఇవ్వడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. దీంతో గౌరు చరిత అనుకూలత కంటే ప్రతికూలతనే ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి గెలిచి తమకు టిక్కెట్ ఇవ్వని వైసీపీకి తమ బలం చూపించాలనుకుంటున్న గౌరు దంపతుల పంతం నెరవేరాలంటే అంత సులువుగా కనిపించడం లేదు. మొత్తానికి పాణ్యంలో టఫ్ ఫైట్ నెలకొననుంది.

Tags:    

Similar News