సర్కార్ కు నూకలు చెల్లుతాయా?

పళనిస్వామి సర్కార్ కూలిపోక తప్పదా? తగిన బలం లేక తనంతట తానుగా దిగిపోతుందా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు [more]

Update: 2019-01-29 17:30 GMT

పళనిస్వామి సర్కార్ కూలిపోక తప్పదా? తగిన బలం లేక తనంతట తానుగా దిగిపోతుందా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి కోర్టు తీర్పుతో తాత్కాలికంగా పళనిస్వామి ప్రభుత్వం ఊరట చెందినా.. త్వరలోనే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు ఎన్నికలకు ముందే పళనిస్వామి దిగిపోక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన విశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న అంశంపై సుప్రీంకోర్టు నుంచి త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పళనిస్వామికి గండం ఉందన్న టాక్ బాగా విన్పిస్తుంది.

విశ్వాస పరీక్ష సమయంలో….

2017లో పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలో ఉన్నా పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారు. నాడు జరిగిన విశ్వాస పరీక్షలో పళనికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వంతో పాటుగా 11మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలసి పోయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా మారారు. అయితే దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ కేసు తీర్పు వచ్చే నెల మొదటి వారంలో వచ్చే అవకాశముంది.

బలం పడిపోయి….

ఇటీవల దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే దీనిపై మద్రాస్ హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం సరైనదేనన్న తీర్పు వచ్చింది. ఈ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఈ పన్నీర్ సెల్వంతో పాటు 11 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కేసులో తీర్పు వ్యతిరేకంగా వస్తే పళని దిగిపోక తప్పదంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 111 మాత్రమే ఉంది. ఈ 11 మందిపై వ్యతిరేకంగా తీర్పు వస్తే వందకు పడిపోతుంది.

డీఎంకే కూటమికి….

డీఎంకే కూటమికి 98 మంది సభ్యులున్నారు. దినకరన్ వర్గంలో నలుగురు ఎమ్మెల్యేల వరకూ ఉన్నారు. వీరంతా కలిస్తే ప్రస్తుతమున్న సభలో సంఖ్యను బట్టి డీఎంకే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటే అవకాశముంది. అందుకోసమే 11 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడితే మాత్రం పళనిస్వామి సర్కార్ కు నూకలు చెల్లినట్లేనన్నది అభిప్రాయం. అందుకోసమే తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ త్వరలోనే పళని ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే దినకరన్ స్టాలిన్ కు మద్దతిస్తారన్నది అందరికీ తెలిసిందే. అందుకే కోర్టు తీర్పు పై అన్నాడీఎంకే నేతలు ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News