అందరూ ఒక్కటవుతారా….?

తమిళనాడులో ఎప్పుుడు ఏదైనా జరగొచ్చనడానికి జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. శత్రువులు మళ్లీ ఏకమయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే బలంగా ఉంది. అన్నాడీఎంకే నాయకత్వ [more]

Update: 2018-12-27 18:29 GMT

తమిళనాడులో ఎప్పుుడు ఏదైనా జరగొచ్చనడానికి జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. శత్రువులు మళ్లీ ఏకమయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే బలంగా ఉంది. అన్నాడీఎంకే నాయకత్వ లేమితో అల్లాడి పోతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వారికే రాజకీయ మనుగడ అన్నది వాస్తవం. ఒకవైపు కమల్ హసన్ మక్కల్ నీది మయ్యమ్ తో దూసుకు వస్తున్నారు. ఆయన ఇతర పార్టీలతో కలసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం పార్టీ ప్రకటన ఇంకా చేయలేదు. ఆయన లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటారు.

డీఎంకే ను వీక్ చేసేందుకు……

ఈ పరిస్థితుల్లో స్టాలిన్ ను వీక్ చేసేందకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్న ఆయన వ్యాఖ్యలతో రాజకీయం టర్న్ తీసుకునే అవకాశముందంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ఆధారంగా డీఎంకే కూటమి తమిళనాట బలంగా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే డీఎంకే కూటమిని దెబ్బ తీసేందుకు కమలం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కమలం పార్టీ మధ్యవర్తిత్వం…..

ఇందులో భాగంగా దినకరన్ పార్టీని, అన్నాడీఎంకేను ఏకం చేయాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తుందంటున్నారు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో ఓట్లు విడిపోయి డీఎంకే లాభపడుతుందన్న ఉద్దేశ్యంతో శత్రువులిద్దరినీ కలపాలని కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే నుంచి విడిపోయి టీటీవీ దినకరన్ తన మేనత్త శశికళ సూచనతో కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ కుటుంబ పట్టు జారిపోలేదని ఇప్పటికే నిరూపించారు.

షరతులు అంగీకరిస్తేనే…..

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా రెండు పార్టీలను కలపాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. శశికళ తప్ప మిగిలిన వారందరినీ పార్టీలోకి చేర్చుకోవడానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. దినకరన్ గూటి నుంచి ఒక్కొక్కరుగా డీఎంకే లో చేరుతుండటం కూడా ఆ పార్టీలో కొంత అసహనం ఉందని అర్థమవుతోంది. ఇటీవలే దినకరన్ వర్గం నుంచి సెంథిల్ బాలాజీ డీఎంకే తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే దినకరన్ కొన్ని షరతులు విధించారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని, మంత్రివర్గంలో కొందరిని తప్పిస్తే విలీనానికి రెడీ అన్న సంకేతాలు పంపారు. అయితే ఇందుకు పళనిస్వామి అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం తమిళనాట వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు, డీఎంకే కూటమిని బలహీన పర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News