పాక్ కు కేక్ వాక్ కాదే….!!!

పాకిస్థాన్-భారత్ ఆగర్భ శత్రుదేశాలు. ఒక దేశం పొడ మరో దేశానికి గిట్టదు. రెండు దేశాల సంబంధాలు ఎప్పుడూ ఉప్పూ..నిప్పే. తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రెండు [more]

Update: 2019-02-28 18:29 GMT

పాకిస్థాన్-భారత్ ఆగర్భ శత్రుదేశాలు. ఒక దేశం పొడ మరో దేశానికి గిట్టదు. రెండు దేశాల సంబంధాలు ఎప్పుడూ ఉప్పూ..నిప్పే. తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రెండు దేశాల మధ్యగల నియంత్రణ రేఖ (location of control) ప్రపంచలోనే సున్నితమైన సరిహద్దుల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పుల్వామా, బాలా కోట్ సంఘటనలతో పరిస్థిితి పూర్తిగా క్షీణించింది. పాక్ కు గుణపాఠం నేర్పాలని, తాడోపేడో తేల్చుకోవాలని ఇక సహనం పనికి రాదన్న వాదన దేశంలో విన్పిస్తున్నాయి.

ఏకాకిని చేయడం ద్వారా…..

వైమానిక దాడులు తర్వాత భారత ప్రభుత్వ పరంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకిని చేయడం, అంతర్జాతీయ వేదికలపై దాని నిర్వాకాన్ని ఎండగట్టడం, వాణిజ్యపరంగా ఆంక్షలు విధించడం వీటిలో ముఖ్యమైనవి. తాజాగా నదీ జలాలను అడ్డుకోవాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ తన వాటా జలాలను కూడా పాకిస్థాన్ కు వదిలేస్తున్న భారత్ ఇకపై అలా చేయరాదని నిర్ణయించింది. దీనివల్ల పాక్ కు సాగు, తాగునీటి ఇబ్బందులు అనివార్యమవుతాయి. నదీజలాల పంపిణీకి సంబంధించి 1960 సెప్టెంబరు 9న ఇరు దేశాల ప్రధానులు నెహ్రూ, ఆయూబ్ ఖాన్ ల మధ్య ఒప్పందం కుదిరింది. సింధు నదికి అయిదు ఉప నదులుంటాయి. వీటిలో చెరిమాడూను రెండు దేశాలకు పంచారు. తూర్పు నదులుగా పేర్కొనే సట్లెజ్, రావి, బియాస్ లను భారత్ కు, జీతూ, సింధు, బీనాబ్ నదులను పాకిస్థాన్ కు కేటాయించారు. వీటిని పశ్చిమ నదులుగా పేర్కొంటారు. మన దేశం మీదుగా పాక్ లోకి ప్రవేశించే నదీ జలాల్లో భారత్ కు 20 శాతం, పాక్ కు 80 శాతం జలాలను కేటాయించారు. దీంతో భారత్ నష్టపోతోంది. ఇప్పుదు ఈ నీటికి అడ్డుకట్ట వేయనున్నారు. తూర్పు ప్రాంత నదీ జలాలను మళ్లించి జమ్మూ, కాశ్మీర్, పంజాబ్ లను సస్యశ్యామలం చేయనున్నారు. రావి నదిపై షాపూర్-కంది వద్ద డ్యామ్ ను నిర్మించనున్నారు. రావి-బియాస్ అనుసంధానం ద్వారా నీటిని మన దేశంలో రాష్ట్రాలకు మళ్లించనున్నారు. దీనివల్ల పాక్ కు నీటి సరఫరా తగ్గి ఆ దేశం కరువు కోరల్లో కూరుకుపోనుంది.

ఎగుమతులు నిలిపివేసి…..

ఎగుమతులు నిలిపివేయడం ద్వారా పాక్ ను భారత్ ఇబ్బందుల్లోకి నెట్టింది. మధ్యప్రదేశ్ నుంచి టమాట ఎగుమతులను ఆపేయడంతో అక్కడ ధరలు చుక్కలను తాకతున్నాయి. రాష్ట్రంలోని “జాబువా” జిల్లా నుంచి రోజూ 70 నుంచి 100 ట్రక్కుల్లో టమాటాలు పాకిస్థాన్ కు ఎగుమంతి అవుతుంటాయి. మరోవైపు పాక్ ఉత్పత్తులపై సుంకాలు 200 శాతం పెంచడంతో ఆ దేశానికి సంకటంగా మారింది. పాక్ నుంచి సిమెంట్ లోడ్లు వస్తున్న 800 లారీలను భారత్ నిలిపివేసింది. మరో 800 లారీలు వెనక్కు వెళ్లాయి. పాకిస్థాన్ కు అత్యంత ప్రాధాన్య హోదా (most forward nation) ను రద్దు చేయడం ఇస్లామాబాద్ నాయకత్వానికి భారత్ ఝలక్ ఇచ్చింది. దీంతో పాక్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతానికి పెంచింది. జాతీయ భద్రత రీత్యా ఏ దేశానికి అయినా అత్యంత ప్రాధాన్య హోదా ను రద్దు చేయడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (wto) నిబంధనలు వెసులు బాటు కల్పిస్తున్నాయి. ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకునే అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ తో పాకిస్థాన్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చడానికి భారత్ ప్రయత్నించింది. ఈ అంశం ఈ ఏడాది అక్టోబర్ లో పరిశీలనకు రానుంది. బ్లాక్ లిస్ట్ లో చేర్చడం వల్ల పాకిస్థాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థికసాయం ఆగిపోతుంది. అసలే ఆర్థక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పాకిస్థాన్ కు ఇది గోరుచుట్టుపై రోకటి పోటులా తయారవుతుంది. ఇంతకాల చైనా, సౌదీ అరేబియా మద్దతు కారణంగా బ్లాక్ లిస్ట్ లో చేరకుండా పాక్ తప్పించుకుంటోంది. పుల్వామా ఘటనను ఆ దేశాలను ఖండించడంతో పాక్ కు ఇబ్బందులు అనివార్యం కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆ ముగ్గురూ తప్ప……

సాధారణ పాక్ పౌరులు సైతం పుల్వామా ఘటనను నిరసిస్తున్నారు. అమాయకులపై దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. పాక్ పాలకులు, సైన్యం, గూఢాచారి సంస్థ ఐఎస్ఐ తప్ప పాక్ ప్రజలు భారత్ తో శాంతినే ఆకాంక్షిస్తున్నారు. మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారాఫ్ వంటి వారు మాత్రం రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండలేకపోతున్నారు. రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన మాజీ క్రికెటర్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్లో పరిపక్వత లోపిస్తోంది. సైన్యం, ఐఎస్ఐ చెప్పినట్లే ఆయన మాట్లాడుతున్నారని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతసేపటికీ ఆధారాలు సమర్పిస్తే దర్యాప్తు చేస్తామని చెప్పడం తప్ప తమ దేశంలో తిష్ట వేసిన ఉగ్రవాద తండాల ఊసు గురించి మాట్లాడటం లేదు. పుల్వామా ఘటనపై ఆయన ప్రతిస్పందన పేలవంగా ఉంది. ఏ పాక్ ప్రధానీ సైన్యం అభిప్రాయానికి భిన్నంగా ముందుకు వెళ్లలేరన్న అభిప్రాయం ఉంది. ఇమ్రాన్ ఖాన్ కూడా అదే బాటలో ఉన్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News