కౌశిక్ రెడ్డి లక్కీ ఫెలోనే

నిన్నటి వరకూ ఆయన కాంగ్రెస్ నేత. అయితే ఈట రాజేందర్ ఎపిసోడ్ తో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా కేసీఆర్ [more]

Update: 2021-08-02 03:30 GMT

నిన్నటి వరకూ ఆయన కాంగ్రెస్ నేత. అయితే ఈట రాజేందర్ ఎపిసోడ్ తో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆయన పేరును ప్రతిపాదించింది. కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడం విశేషం. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు.

ఈటలపై ఆరోపణలు చేసి….

కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఈటల రాజేందర్ పైన ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగాలని తొలుత భావించారు. అయితే పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో జరిగిన పరిణామాలు కౌశిక్ రెడ్డి ఆలోచనలో మార్పు తెచ్చాయి. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేసిన వెంటనే ఆయనపై తొలి విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతగా కౌశిక్ రెడ్డి గుర్తింపు పొందారు.

కాంగ్రెస్ నుంచి…

కాంగ్రెస్ ఈటల రాజేందర్ పై సానుకూల ధోరణలో ఉన్నా కౌశిక్ రెడ్డి మాత్రం విమర్శలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే పార్టీ వ్యతిరరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన రోజునే ఆయనకు భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.

పది రోజుల్లోనే….

కానీ ఇంత త్వరగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అదే జిల్లాకుచెందిన టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఎమ్మెల్సీ పదవి హామీని కేసీఆర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ అకస్మాత్తుగా కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కు పంపడంతో హుజూరాబాద్ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పార్టీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కౌశిక్ రెడ్డికి పదవి దక్కడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News