లాలూకు దెబ్బ మీద దెబ్బలు… కోలుకునేనా?

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ రాజకీయంగా ఇబ్బంది పడుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ ప్రస్తుతం నాయకత్వ సమస్యతో బాధపడుతోంది. లాలూ ప్రసాద్ [more]

Update: 2020-08-21 18:29 GMT

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ రాజకీయంగా ఇబ్బంది పడుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ ప్రస్తుతం నాయకత్వ సమస్యతో బాధపడుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. ఆర్జేడీ పార్టీ వ్యవహారాలను తేజస్వీ యాదవ్ చూస్తుండటం సోదరుడు తేజ్ పాల్ యాదవ్ కు నచ్చడం లేదు. మరోవైపు అధికార జేడీయూ, బీజేపీ బలంగా ఉన్నాయి.

నాయకత్వ లోపంతో….

దీంతో రాష్ట్రీయ జనతా దళ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. బీహార్ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది. ఈ ఏడాది నవంబరు 29వ తేదీతో బీహార్ ప్రభుత్వం పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన విపక్ష ఆర్జేడీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. నాయకత్వ లోపం అని వేలెత్తి చూపుతూ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు.

హామీలు పొంది మరీ….

వచ్చే ఎన్నికల్లో ఆ సీటు తిరిగి వాళ్లకే ఇస్తామన్న హామీతో అధికార పార్టీ వైపు వెళుతున్నారన్న టాక్ వినపడుతుంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రేమ చౌదరి, మహేష్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీలు అధికార పార్టీ జనతాదళ్ యులో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరికి జేడీయూ అధిష్టానం కూడా స్వాగతం పలికింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి టిక్కెట్ ఇచ్చే ప్రాతిపదికపై మూడు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను జేడీయూ ఆకట్టుకుంది.

ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో…..

దీంతో లాలూప్రసాద్ యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ ఆ ముగ్గురిని సస్పెండ్ చేసింది. వీరిని ఇలాగే కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టమని భావించి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. నిజంగా వారు కోరుకున్నదీ అదే. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆర్జేడీలో ఉంటూ నితీష్ కుమార్ ను వివిధ అంశాల్లో ప్రశంసిస్తుడటం ఆర్జేడీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో వారు ముగ్గురిని సస్పెండ్ చేశారు. మరికొంత మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద లాలూప్రసాద్ యాదవ్ పార్టీకి ఎన్నికల వేళ గట్టి దెబ్బలే తగులుతున్నాయి.

Tags:    

Similar News