చిన్నమ్మపైన పెద్ద ఆశలు ?

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ కి మించిన నాయకుడు లేడు. అది అందరూ ఒప్పుకునే విషయం. ఆయనలా ప్రతీ ఒక్కరికీ తెలిసిన ప్రజా నాయకుడు లేరు అనే ఎవరైనా [more]

Update: 2021-02-05 12:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ కి మించిన నాయకుడు లేడు. అది అందరూ ఒప్పుకునే విషయం. ఆయనలా ప్రతీ ఒక్కరికీ తెలిసిన ప్రజా నాయకుడు లేరు అనే ఎవరైనా చెబుతారు. దానికి కారణం ఎన్టీఆర్ సినీ జీవితం. ఆయన మూడు వందల యాభైకి పైగా సినిమాలు చేశారు. దాంతో అన్ని తరాల వారికీ తెర పరిచయం అయిపోయారు. ఆ మీదట రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటారు. దాంతో ఆయన చరిష్మా టాప్ లెవెల్ లో ఉండేది. ఆయన వారసులు రాజకీయ రంగాన చెప్పుకుంటే అటు టీడీపీలో బాలక్రిష్ణ, ఇటు బీజేపీలో దగ్గుబాటి పురంధేశ్వరి కనిపిస్తారు. అయితే బాలక్రిష్ణకు అక్కడ ఎదిగేందుకు స్కోప్ చాలా తక్కువ. మరి బీజేపీ లాంటి జాతీయ పార్టీ మాత్రం చిన్నమ్మ మీద గట్టిగానే ఫోకస్ పెడుతోంది.

ఆమె చుట్టూనే అంతా…

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉంది. ఆయన పెట్టిన టీడీపీని అల్లుడు చంద్రబాబు నడుపుస్తున్నా ఎన్టీఆర్ అసలైన అభిమాన జనం దూరంగానే ఉన్నారు. మరో వైపు ఎన్టీఆర్ లెగసీని ఎవరూ ఇప్పటికీ క్లైయిమ్ చేయలేకపోతున్నారు. ఆ సమయంలో ఆయన కుమార్తె పురంధేశ్వరిని బీజేపీ ముందుంచి ఏపీ రాజకీయాలను నడపాలనుకుంటోంది. బీజేపీ ఈ విషయంలో చాలానే చేస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరిని నియమించిన ఆమె కాషాయం పార్టీ ఎన్టీఆర్ బ్లడ్ కి ఇస్తున్న విలువ ఏంటన్నది జనాలకు చెప్పకనే చెప్పింది.

పెద్ద పీట వేశారా…?

ఇక తాజాగా విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి వేదిక పురంధేశ్వరి ఇల్లు కావడం విశేషం. ఆమె ఇంటికే బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖులు వచ్చి ఆతీధ్యం స్వీకరించారు. అంటే ఇది ఒక విధంగా బీజేపీ ఎత్తుగడగానే చూడాలి అంటున్నారు. అలాగే బీజేపీలో చిన్నమ్మకు ఇస్తున్న స్థానాన్ని కూడా మిగిలిన నేతలు గుర్తించాలని కూడా ఒక సూచన ఇందులో ఉందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజికవర్గం బీజేపీ వైపుగా మళ్లాలన్నా ఎన్టీఆర్ అభిమాన జనం ఇటు వైపు తిరగాలి అన్నా కూడా చిన్నమ్మను ముందుంచితేనే తప్ప జరిగేది కాదని బీజేపీ గ్రహించే ఇలా చేస్తోంది అంటున్నారు.

ఆమె కను సన్నలలో….

బీజేపీ ఏపీ వరకూ కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. ఆయన ద్వారా కాపులను దువ్వుతోంది. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ తో మైత్రితో బీజేపీ ఆయన వైపు ఉన్న సినీ గ్లామర్ ని వాడుకోవాలనుకుంటోంది. ఇక పురంధేశ్వరి వంటి వారి ద్వారా తెలుగుదేశం వైపు ఉన్న కొన్ని వర్గాలను, ఎన్టీఆర్ అభమానులను ఆకట్టుకోవాలని చూస్తోంది. వీటిని కనుక జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ బహుముఖ వ్యూహంతోనే ముందుకు సాగుతోంది అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చిన్నమ్మ పాత్ర అమాంతం పెరిగిపోతోంది. ఆమె మాటకు జాతీయ స్థాయిలో విలువ కూడా ఉందని అంటున్నారు. దాన్ని కనుక ఆమె సామాజికవర్గం నేతలు ఎంత గట్టిగా విశ్వసిస్తే అంత వేగంగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని విశ్లేషిస్తున్నారు

Tags:    

Similar News