డాల్ఫిన్ టూ నాగావళి… ?

సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో అనూహ్యమైన రాజకీయం జరిగింది. సొంత కుటుంబమే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది. అది 1995 ఆగస్ట్ నెల. ఎన్టీయార్ [more]

Update: 2021-08-26 09:30 GMT

సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో అనూహ్యమైన రాజకీయం జరిగింది. సొంత కుటుంబమే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది. అది 1995 ఆగస్ట్ నెల. ఎన్టీయార్ ప్రజల‌ వద్దకు పరిపాలన పేరిట ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 15న హైదరాబాద్ లో జెండా ఎగరేసిన ఎన్టీఆర్ ఆ తరువాత ఉత్తరాంధ్రాను సెంటిమెంట్ గా భావించి అక్కడ నుంచే ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన శ్రీకాకుళం నుంచి దీనికి శ్రీకారం చుడితే జనం వెల్లువలా వచ్చారు. దానికి ముందు విశాఖలో ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతి, వెంట నాటి మంత్రి, అల్లుడు చంద్రబాబు, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టులో దిగితే ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ 1994లో అధికారంలోకి వచ్చాక విశాఖ రావడం అదే ప్రధమం కావడంతో జన నీరాజనంతో సాగరతీరం మొత్తం పులకించింది.

అక్కడే ఆగిన అల్లుడు :

ఇక ఎన్టీఆర్ విశాఖ నుంచి శ్రీకాకుళం బయల్దేరి వెళ్తే అల్లుడు, నాటి రెవిన్యూ ఆర్ధిక మంత్రిత్వ శాఖలు చూస్తున్న చంద్రబాబు విశాఖ డాల్ఫిన్ హొటల్ లోనే బస చేశారు. ఆయనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడే మకాం వేశారు. ఎన్టీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు. ఉత్సాహంగా తన సతీమణితో కలసి శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని నాగావళి హొటల్ లో బస చేశారు. ఇక చంద్రబాబు ఆపరేషన్ వెన్నుపోటు డాల్ఫిన్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడ నుంచే బాబు ల్యాండ్ లైన్ ద్వారా మొత్తం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎన్టీయార్ వ్యతిరేక చర్యలకు ఓడిగట్టారని చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాల్ఫిన్ హొటల్ లో ల్యాండ్ లైన్ బాబు అక్కడ ఉన్న రోజంతా అర సెకన్ కూడా విరాం లేకుండా మోగుతూనే ఉందిట. ఇదంతా ఆగస్ట్ మూడవ వారంలో జరిగిన ముచ్చట.

సేమ్ డేట్ ….?

ఆంధ్రులకు గర్వకారణం, తెల్ల దొరలకు వణుకు పుట్టించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన రోజు ఆగస్ట్ 23. ఆ రోజునే చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన రోజు. దాంతో దాని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ మరీ టీడీపీకి మంట పుట్టించారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ప్రకాశానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె నుంచి తప్పించడానికి నాటి కాంగ్రెస్ పెద్దల ద్వారా వెన్నుపోటు జరిగింది అని చరిత్ర చెబుతుంది. మొత్తానికి ఎన్టీఆర్ వెన్నుపోటు ఆపరేషన్ మాత్రం అటు విశాఖ సాగరతీరం నుంచి అటు శ్రీకాకుళం నాగావళీ నదీ తీరం సాక్ష్యంగా సాగింది అని పాతికేళ్ల చరిత్ర చెబుతోంది.

అన్నీ ఉన్నా కూడా….

ఇక చూడబోతే బృందావనీ ఉంది యమునా నదీ ఉంది కన్నయ్యే కనుల ఎదుట లేడు అన్నట్లుగా చుట్టూ అన్నీ ఉన్నాయి కానీ తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక లాంటి ఎన్టీఆర్ మాత్రం తన వారే కత్తులు దూస్తే ఆ దారుణమైన వెన్నుపోటుకు నేలకొరిగారు. ఆయన తరువాత కొద్ది రోజులకే ఈ లోకాన్ని వీడారు. ఇపుడు నాగావళి హొటల్ ఉంది. డాల్ఫిన్ కూడా ఉంది నాగావళి నదీ గలగ‌లలున్నాయి. అలాగే విశాఖ సాగర తరంగాలున్నాయి. అవి మాత్రం అన్న గారికి జరిగిన వెన్నుపోటుని తలచుకుంటూ అలా కాలాన్ని కరిగిస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నాయి.

Tags:    

Similar News